జీతం బకాయిలు చెల్లించండి
ABN , First Publish Date - 2021-03-03T04:54:22+05:30 IST
తమకు జీతం బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పారిశుధ్య సిబ్బంది రోడ్డెక్కారు. మంగళవారం జీజీహెచ్ ఎదుట రాస్తారోకో చేశారు.
జీజీహెచ్ ఎదుట పారిశుధ్య కార్మికుల రాస్తారోకో
నెల్లూరు (వైద్యం), మార్చి 2 : తమకు జీతం బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పారిశుధ్య సిబ్బంది రోడ్డెక్కారు. మంగళవారం జీజీహెచ్ ఎదుట రాస్తారోకో చేశారు. దాదాపు గంటపాటు రోడ్డును దిగ్బంధించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముందుగా జీజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఐదు నెలలుగా తమకు జీతాలు చెల్లించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, సీఐటీయూ నేతలు సతీష్, బత్తల కిష్ణయ్య తదితరులు ఈ సమస్యను జేసీ ప్రభాకర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ను కలసి వివరించారు. సూపరింటెండెంట్ జీతం బకాయిల చెల్లింపు ఫైలుపై సంతకాలు పెట్టి ట్రెజరీకి పంపటంతో కార్మికులు నిరసన విరమించారు.