అటు కాసుల పంట

ABN , First Publish Date - 2021-04-11T06:50:06+05:30 IST

సరిగ్గా భవన నిర్మాణ రంగంలో పనుల వేగం పుంజుకునే సమయంలో ఇసుక కొరత ఇబ్బంది పెడుతోంది.

అటు కాసుల పంట
ఫోర్త్‌ బ్రిడ్జి కింద గోదావరిలో యంత్రంతో బాట వేస్తున్న దృశ్యంఇటు ఇసుక కొరత .,.

 భవన నిర్మాణ పనుల సమయంలో సమస్య 

 ఇంకా మొదలెట్టని కార్పొరేట్‌ కాంట్రాక్టర్‌ 

 ఆగిపోయిన ర్యాంపులు 

 పట్టా భూముల నుంచి విశాఖకే ఇసుక 

 కొరతతో దోపిడీ

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

సరిగ్గా భవన నిర్మాణ రంగంలో పనుల వేగం పుంజుకునే సమయంలో ఇసుక కొరత ఇబ్బంది పెడుతోంది. ఈ పరిస్థితి ఇసుకాసురులకు కాసుల పంటగా మారింది. గతనెల 31 నుంచి ఇంచుమించు ర్యాంపులన్నీ ఆపేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను మూడు భాగాలుగా శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకూ ఒక భాగంగా విభజించిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు భాగాలను ఒకే కార్పొరేట్‌కు సంస్థకు అప్పగించించారు. ఏప్రిల్‌ 1 నుంచి కార్పొరేట్‌ సంస్థ ఇసుక వ్యాపారం మొదలెడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకూ రంగంలోకి దిగలేదు. ఏపీఎండీసీ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆయన ఆధ్వర్యంలోనే కార్పొరేట్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించవలసి ఉందనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కార్పొరేట్‌ సంస్థతో ఒప్పందం కుదిరిందనే కారణంతోనే మార్చి 31 నుంచి జిల్లాలోని ఓపెన్‌ రీచ్‌లన్నీ ఆపేశారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ కూడా ఆగిపోయింది. గతంలో బుక్‌ చేసుకున్నవారికి కూడా అతి కష్టం మీద ఇసుక పంపిస్తున్నారు.  ప్రస్తుతం సీతానగరం మండలంలోని పట్టా భూముల్లో మాత్రమే ఇసుక తీస్తు న్నారు. ఆత్రేయపురంలో పెండింగ్‌ ఉంది. కానీ ఇంకా అది ఎవరూ తవ్వడంలేదు. కోటిలింగాల-1లో పెండింగ్‌ బిల్లులు మేరకు ఇసుక తీత నడుస్తున్నట్టు సమాచారం. సీతానగరం మండలంలో కాటవరం, ప్రక్కిలంక, ములకల్లంక వంటి ప్రాంతాలలో పట్టా భూముల నుంచి మాత్రం విశాఖకు ఇసుక తరలిపోతోంది. జిల్లాలో వ్యక్తిగతంగా సొంత ఇల్లు కట్టుకునేవారికి ఇసుక దొరకడంలేదు. వేసవి కాలంలోనే భవన నిర్మాణాల పనులు బాగా జరుగుతాయి. మూడేళ్ల నుంచి ప్రతీ ఏటా ఇసుక ఇబ్బంది ఏర్పడుతోంది. 2020లో ఇసుక విధానం ఒక కొలిక్కి వచ్చే సమయంలో కొవిడ్‌ వల్ల సమస్య ఏర్పడింది. బల్క్‌ బుకింగ్‌లకు ఇబ్బంది లేకపోయినా, సొంతంగా ఇల్లు కట్టుకునేవారికి ఇబ్బంది అయింది. ఇసుక సరఫరా బాగుపడిందనే సమ యంలో ప్రభుత్వం మొత్తం ర్యాంపులను కార్పొరేట్‌ సంస్థకు అప్పగించింది. ఈనేపఽథ్యంలో మార్చి 31 నుంచి అన్ని ఓపెన్‌ రీచ్‌లను ఆపేసింది. కానీ కొత్త కాంట్రాక్టర్‌ ఇంకా పని మొదలెట్టలేదు. మరోవైపు గోదావరిలో పడవల మీద ఇసుక తీయడానికి సొసైటీలను కార్పొరేట్‌ సంస్థ ప్రతినిధులు సంప్రదించినట్టు సమాచారం. ఓపెన్‌ రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వేస్తారు. పడవల మీద తీయడానికి గోదావరిలో పడవల మీద వెళ్లి తీయాలి. ఈ ర్యాంపులు కొన్ని సొసైటీల చేతుల్లో ఉన్నాయి. వీటిని ముందు పెట్టి వేరేవారు గతం నుంచి ఇసుక వ్యాపారం చేస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థ కూడా పడవల వరకూ ఈ సొసైటీలకు అప్పగించే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఈ సంస్థ డబ్బు సరిగ్గా చెల్లిస్తుందా లేదా అనే అను మానంతో ఎవరూ ముందుకురావడంలేదు. గతంలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఈ సొసైటీలకు కొంత బకా యి ఉన్నట్టు కొందరు చెబుతున్నారు. ఇటు జిల్లాలో ఇసుక దోపిడీ ఎక్కువైంది. అధికారికంగా ర్యాంపులు పనిచేయకపోవడం వల్ల రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ ప్రతీ చోట ఇసుక తవ్వేస్తున్నారు. కోనసీమలో పలు గోదావరి సమీప గ్రామాల్లో కూడా ఇదే తతంగం నడుస్తోంది. పి.గన్నవరం మండలంలో ఏకంగా రాత్రుల సమయంలో డ్రెడ్జింగ్‌తో తవ్వేస్తున్నారు. ముఖ్య ప్రజాప్రతినిధి బావమరిది బంధువు ఒకరు ఇక్కడ చక్రం తిప్పుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీతానగరం మండలం కాటవరం, పక్కిలంక తదితర ప్రాంతాల్లోని పట్టాభూము ల నుంచి విశాఖకు బల్క్‌ ఆర్డర్ల ద్వారా అనుమతి ఉంది. ఈనెల 1నుంచి కొత్త బల్కు ఆర్డర్లకు అను మతి ఇవ్వడంలేదనే  చెబుతున్నారు. ఈనేపథ్యంలో సీతానగరం మండలంలోని ఈ ర్యాంపుల్లో  దోపిడీ పెరిగింది. నిజానికి రాత్రి 7 గంటల తర్వాత అను మతి లేదు. కానీ విశాఖ పేరుతో దారుణంగా ఇక్కడ ఇసుక దోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని మరో ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఒకరికి సంబంధించిన మనుషులే ఇక్కడ దోపిడీ చేయడం గమనార్హం. రాజమహేంద్రవరం ఫోర్త్‌ బ్రిడ్జి కింద గోదావరిలో ఓ యంత్రంతో 500 మీటర్ల దూరం బాట వేస్తున్నారు. ఇక్కడ గోదావరిలో తేలిన ఇసుక దిబ్బలను తవ్వేసి ఎత్తుగడతో ఇక్కడ ఈ బాట వేస్తున్నారు. మాపోరేపో ఇక్కడ తరలింపునకు శ్రీకారం చుట్టనున్నారు.



Updated Date - 2021-04-11T06:50:06+05:30 IST