మన్నెంకుంటలో ఇసుక తవ్వకాలు

ABN , First Publish Date - 2021-06-24T05:45:46+05:30 IST

అధికారుల పర్యవేక్షణ లోపం.. ఇసుక వ్యాపారుల అక్రమ తవ్వకాల ఫలితంగా మండలంలోని పలు గ్రామాల్లో చిన్న నీటి వనరులైన చెర్వులు, కుంటలు ధ్వంసమవుతున్నాయి.

మన్నెంకుంటలో ఇసుక తవ్వకాలు
చెరువునుంచి ఇసుకను తరలించడంతో ఇలా..

 చెరువులో  గోతులు ఫ పట్టించుకోని అధికారులు

నార్కట్‌పల్లి, జూన్‌ 23: అధికారుల పర్యవేక్షణ లోపం.. ఇసుక వ్యాపారుల అక్రమ తవ్వకాల ఫలితంగా మండలంలోని పలు గ్రామాల్లో చిన్న నీటి వనరులైన చెర్వులు, కుంటలు ధ్వంసమవుతున్నాయి. జలశక్తి అభియాన్‌ పథకం కింద ఓ వైపు జిల్లాలో చిన్ననీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపునకు విస్త్రృతంగా కార్యక్రమాలు చేపడుతుంటే నార్కట్‌పల్లి మండలంలోని కొన్ని చెర్వులు, కుంటలు ఇసుకాసురుల తవ్వకాలతో కనుమరుగవుతున్నాయి. మండలంలోని ఎల్లారెడ్డిగూడెం శివారులో గల మన్నెంకుంట ఇసుక లభ్యతను గుర్తించిన మాఫియా గత కొన్ని నెలలుగా ఇసుక తవ్వకాలను చేపట్టింది. తొలుత కూలీలను మాత్రమే వినియోగించి స్థానిక అవసరాలకు మాత్రమే వాడుకునేలా ఇసుకను తవ్విన ఇసుకాసురులు అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో ఏకంగా ఎక్స్‌కవేటర్లను ఉపయోగించి ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారు. ఉపరితలం నుంచి రెండు నుంచి మూడు పొరల తర్వాత ఇసుక లభిస్తుండటంతో లోతైన గుంతలు తవ్వారు. దీంతో మన్నెంకుంట చెర్వు భౌతిక రూపు రేఖలు మారిపోయి ఽక్రమంగా ధ్వంసమవుతోంది. అసలే మిషన్‌ కాకతీయ పథకం కింద తూతూ మంత్రంగా చేసిన పనులతో కట్ట నాణ్యత దెబ్బతినగా తాజాగా చెర్వులో ఇసుక అక్రమ తవ్వకాలు చెర్వు ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కొందరు రాజకీయ అండదండలతోనే ఈ వ్యవహారం యథేఛ్చగా నడుస్తుందని ఈ కారణంగానే సంబంధిత అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. అనుమతులు లేకుండా చెర్వులో చేపట్టిన ఇసుక, మట్టి తవ్వకం పనులను అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. 

చెర్వులో తవ్వకాలను అడ్డుకోవాలి: పనస రవి,   గ్రామస్థుడు

కుంట చెర్వులో ఇసుక తవ్వకాలను అధికారులు అడ్డుకోవాలి. ఇప్పటికే జరిపిన తవ్వకాలతో చెర్వు ధ్వంసమైంది. పెద్దఎత్తున ఏర్పడిన గుంతలతో ప్రమాదం పొంచి ఉంది.  ఈ వ్యవహారాన్ని గతంలోనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు.

Updated Date - 2021-06-24T05:45:46+05:30 IST