Nawab Malik పై సమీర్ వాంఖడే మరదలు పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-11-10T13:57:51+05:30 IST

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పై ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మరదలు పోలీసులకు ఫిర్యాదు చేశారు....

Nawab Malik పై సమీర్ వాంఖడే మరదలు పోలీసులకు ఫిర్యాదు

ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పై ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మరదలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘సమీర్ వాంఖడే మరదలు హర్షదా దీనానాథ్ రెడ్కర్ డ్రగ్స్ వ్యాపారంలో పాలుపంచుకున్నారా అని మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ట్వీట్ పై స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి నవాబ్, మరో వ్యక్తి నిశాంత్ వర్మలపై ఐపీసీ సెక్షన్లు 354,354 డి, 503, 506, మహిళల అసభ్య ప్రాతినిథ్య చట్టం 1986లోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయాలని కోరుతూ హర్షదా దీనానాథ్ రెడ్కర్ గోరేగావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మంత్రి చేసిన ట్వీట్ ను హర్షదా తన ఫిర్యాదుకు జత పర్చారు. 


డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో సమీర్ వాంఖడేను బెదిరించేందుకే మాలిక్, వర్మలు తనపై ఆరోపణలు చేశారని హర్షదా చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కారణంగా పూణెలో నమోదైన కేసులో తనను ఇరికించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు పూణెలోని కోర్టులో పెండింగ్‌లో ఉందని ఆమె తెలిపారు.తనను తాను రాజకీయ విశ్లేషకుడిగా చెప్పుకునే వర్మ రూమర్ల వ్యాపారి అని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడని ఫిర్యాదులో హర్షదా చెప్పారు. ఫిర్యాదులో నవాబ్ మాలిక్‌ను కూడా నిందితుడిగా ప్రస్థావించారు.


 ‘‘14 సంవత్సరాల క్రితం నమోదైన కేసు గురించి ట్వీట్‌లో పేర్కొన్నారు. నిందితులు కేవలం నా బావను బెదిరించాలనుకుంటున్నారు. మంత్రి మాలిక్, వర్మలు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు’’ అని ఫిర్యాదులో సమీర్ మరదలు హర్షదా పేర్కొంది.


Updated Date - 2021-11-10T13:57:51+05:30 IST