ఎస్పీ నేత ములాయం.. సైకిల్ గుర్తుకు ముందు ఎన్ని గుర్తులతో పోటీ చేశారంటే..
ABN , First Publish Date - 2022-02-23T14:12:35+05:30 IST
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక ర్యాలీలో...
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక ర్యాలీలో తన ప్రసంగంలో సైకిల్ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీకి , ఉగ్రవాదానికి సంబంధం ఉన్నదని కూడా వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి సమాజ్వాదీ పార్టీతో పాటు దాని సైకిల్ గుర్తుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ ప్రసంగంపై వివిధ రకాలుగా స్పందనలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సమాజ్ వాదీ పార్టీకి సైకిల్ గుర్తు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ 1992, అక్టోబర్ 4న సమాజ్వాదీ పార్టీని స్థాపించారు. 1993 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి సైకిల్ గుర్తు వచ్చింది. ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 256 స్థానాల్లో పోటీ చేసి, 109 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ములాయం రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
దీనికి ముందు ములాయం 1989 నుండి 1991 మధ్యకాలంలోనూ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయితే అప్పుడు ఆయన ఎన్నికల గుర్తు చక్రం. అది జనతాదళ్లో భాగం. ములాయం గతంలో ఇతర పార్టీల గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేశారని చాలామందికి తెలియదు. సైకిల్ గుర్తుకన్నా ముందు, ములాయం సింగ్ యాదవ్ మర్రి చెట్టు, ఎడ్ల జోడీ, రైతు మొదలైన గుర్తులపై ఎన్నికల్లో పోటీ చేశారు. దీని గురించి సమాజ్వాదీ పార్టీ యుపి అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ పలు వివరాలు తెలిపారు. 1993 అసెంబ్లీ ఎన్నికలకు గుర్తును ఎన్నుకునే విషయానికి వస్తే.. ములాయంతో పాటు ఇతర సీనియర్ నాయకులు అందుబాటులో ఉన్న ఎంపికలలో సైకిల్ను ఎంచుకున్నారు. ఆ సమయంలో రైతులు, పేదలు, కార్మికులు. మధ్యతరగతి ప్రజల సైకిల్ను అధికంగా వినియోగించేవారు. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు.