జీతాలకు పనిచేసేవారిని ‘అమరులు’ అనొద్దు : అస్సాం రచయిత్రి

ABN , First Publish Date - 2021-04-08T18:20:20+05:30 IST

జీతం తీసుకునేవారు తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే, వారిని

జీతాలకు పనిచేసేవారిని ‘అమరులు’ అనొద్దు : అస్సాం రచయిత్రి

న్యూఢిల్లీ : జీతం తీసుకునేవారు తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే, వారిని ‘అమరులు’ అనకూడదని అస్సాం రచయిత్రి శిఖా శర్మ వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఏప్రిల్ 5న ఫేస్‌బుక్‌లో ఆమె ఈ వివాదాస్పద పోస్ట్ చేశారు. 


గౌహతి పోలీస్ కమిషనర్ మున్నా ప్రసాద్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, శిఖా శర్మ భద్రతా దళాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘జీతాలు తీసుకునేవారు తమ విధి నిర్వహణలో మరణిస్తే, వారిని అమరులు అనకూడదు. అలా అయితే విద్యుత్తు శాఖ ఉద్యోగి తన విధి నిర్వహణలో విద్యుదాఘాతంతో మరణిస్తే, ఆ ఉద్యోగి కూడా అమరుడే అవుతారు. ప్రజలు భావోద్వేగాలకు గురయ్యేలా మీడియా చేయకూడదు’’ అని శిఖా శర్మ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. ఈ పోస్ట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇద్దరు బీజేపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఆమెపై వివిధ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. మంగళవారం ఆమెను అరెస్టు చేశారు. కామరూప్ మెట్రో డిస్ట్రిక్ట్ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 


ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో సీఆర్‌పీఎఫ్ తదితర భద్రతా దళాలపై మావోయిస్టులు ఏప్రిల్ 3న దాడి చేశారు. ఈ దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. దాదాపు 31 మంది గాయపడ్డారు. అమరులైనవారిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ దిలీప్‌ కుమార్ దాస్, కానిస్టేబుల్ బాబుల్ రభ అస్సాంకు చెందినవారు. 


శిఖా శర్మ బీజేపీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతూ ఉంటారు. ఆమెకు గతంలో రేప్ హెచ్చరికలు వచ్చాయి. ఈ హెచ్చరికలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2021-04-08T18:20:20+05:30 IST