ఇంతమంది ఎమ్మెల్యేలుండి ఏం సాధించారు?
ABN , First Publish Date - 2020-06-03T10:44:49+05:30 IST
జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇంతమంది ఉండి ఏం సాధించారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు.
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్..
పరిగి/హిందూపురం టౌన్, జూన్ 2: జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇంతమంది ఉండి ఏం సాధించారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. మంగళవారం సేవామందిరంలో హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్యనాయకులతో సంస్థాగత ఎన్నికలపై ఆయన సమీక్ష నిర్వహించారు. శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవగాహనలేని ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిలో విఫలమయ్యాయన్నారు.
కరోనాను ఒక మతానికి అంటగట్టి తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. జిల్లాలో ఇంతమంది ఎమ్మెల్యేలుండి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పథకాలకే పేర్లు, నెంబర్లు మార్చి ప్రారంభిస్తున్నారని దుయ్యబట్టారు. అశాస్ర్తీయ విధానాలతో రాష్ట్ర ప్రజలకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వలస కార్మికులు ఆకలితో చస్తుంటే వారిని కాపాడాల్సింది పోయి, రాష్ట్ర సరిహద్దులో వదిలేయటం బాధాకరమన్నారు. రోడ్లపైనే మహిళలు ప్రసవిస్తూ, రైలు కిందపడి మరణించటం దారుణమన్నారు. వారిపై దయ చూపకపోవటం హేయమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేసులు నమోదు చేయటంతోపాటు రోడ్లపైనే చితకబాదుతున్నారని ధ్వజమెత్తారు. వైద్యుడు సుధాకర్ కేసులో సాక్షాత్తు హైకోర్టే జగన్పై నమ్మకం లేదన్నా.. ప్రభుత్వానికి బుద్ధి రాలేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పెనుకొండ ఇన్చార్జ్ కేటీ శ్రీధర్ పాల్గొన్నారు.