Sai Dharam Tej నడిపిన బైక్ రిజిస్టర్ అయ్యింది ఇతని పేరు మీదే..

ABN , First Publish Date - 2021-09-11T18:07:27+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హైదరాబాద్‌లోని...

Sai Dharam Tej నడిపిన బైక్ రిజిస్టర్ అయ్యింది ఇతని పేరు మీదే..

హైదరాబాద్ సిటీ : మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. అయితే ఆయన నడిపిన బైక్ ఏంటి..? దాని ధర ఎంతుంటుంది..? అసలు ఆ బైక్ ఎవరు పేరిట రిజిస్టర్ అయ్యింది..? రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది..? ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఏయే సెక్షన్లపై కేసులు నమోదు చేశారు..? అనే విషయాలపై ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ వివరాలన్నీ ఈ వార్తలో తెలుసుకుందాం.


బైక్ వివరాలు ఇవీ.. 

బైక్ మోడల్ Triumph RS Street Triple. ఈ బండి సుమారు 11.14 లక్షల నుంచి 11.16 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. సాయి ధరమ్ 765 సీసీ ట్రిపుల్ సిలిండర్ ఇంజిన్‌తో ఉన్న స్పోర్ట్స్ బైక్‌ను గతేడాది కొన్నట్లు సమాచారం. అయితే ఆ బైక్ అతని పేరిట కాకుండా అనిల్ కుమార్ బుర్ర అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయ్యింది. అంతేకాదు.. ఈ బైక్‌పై ఇప్పటికే ఓవర్ స్పీడ్ చలానా కూడా ఉందని తెలిసింది. ఈ బైక్ సాయి ధరమ్‌తో పాటు పలువురు యువ హీరోల దగ్గర కూడా ఉందట. అలా కొందరు మిత్రులతో కలిసి వీకెండ్ కావడంతో పార్టీలో ఎంజాయ్ చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే.. ఓవర్ స్పీడ్ కావడంతో ఇలా ప్రమాదం జరిగిందని కొందరు అంటుంటే.. మరికొందరేమో ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇసుక ఉందని అందుకే బైక్ స్కిడ్ అయ్యిందని చెబుతున్నారు.


స్పోర్ట్స్ బైక్‌లు అంటే ఎంతో ఇష్టం..

తనకు స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూల్లో సాయి ధరమ్ తేజ్ ఓపెన్‌గానే చెప్పాడు. వీకెండ్స్‌లో ఇదే బైక్‌పైనే ఫ్రెండ్స్‌తో ట్రిప్స్‌కి వెళ్ళేవాడు. హీరో సందీప్ కిషన్, నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ ఇద్దరూ సాయికి బెస్ట్ ఫ్రెండ్స్. పార్టీకి లేదా ట్రిప్‌కు వెళ్లొచ్చిన తర్వాత నరేష్ ఇంట్లోనే బైక్ పెట్టి అక్కడ్నుంచి కారులో తన ఇంటికి తేజ్ వెళ్లేవాడు. అంతేకాదు.. ప్రమాదానికి ముందు నరేష్ ఇంటి నుంచే సాయి బయల్దేరాడు. కాగా.. ఈ ప్రమాదం గురించి నరేష్ మీడియాతో మాట్లాడుతూ.. పలుమార్లు నవీన్‌కు, సాయికి వార్నింగ్ కూడా ఇచ్చానన్నారు.


బైక్ సీజ్.. కేసులు ఇవీ..

ఈ ప్రమాదం జరిగిన తర్వాత బైక్‌ను రాయదుర్గం పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు.. బైక్ నడిపిన తేజ్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. ఐపీసీ 336, 184 ఎంవీ (Motor Vehicles) యాక్ట్ కింద కేసు కూడా కేసు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలోనే అత్యవసర విభాగంలో తేజ్ చికిత్స తీసుకుంటున్నాడు.

Updated Date - 2021-09-11T18:07:27+05:30 IST