భక్తుల భద్రతకు తొలి ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-01-20T06:48:13+05:30 IST
రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తొలి ప్రాధాన్యం ఇస్తామని వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ అన్నారు.
వేములవాడ, జనవరి 19 : రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తొలి ప్రాధాన్యం ఇస్తామని వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ అన్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న తరుణంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న క్రమంలో ఆలయ పరిసరాలలో భద్రతా ఏర్పాట్లపై డీఎస్పీ చంద్రకాంత్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆలయ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై ఆలయ పరిసరాలు వసతిగదులు, క్యూలైన్లలో సీసీ కెమెరాలు, వాటి పనితీరు తదితర అంశాలపై చర్చించారు. భక్తుల భద్రతను ప్రాధాన్యత అంశంగా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయ పరిసరాలలో ప్రస్తుతం 127 సీసీ కెమెరాలు ఉన్నాయని, అవసరం మేరకు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్ తెలిపారు. పట్టణ సీఐ వెంకటేశ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.