పాపం పిల్లలు..!
ABN , First Publish Date - 2022-03-12T06:48:31+05:30 IST
మండలంలోని కక్కలపల్లి పంచాయతీ పిల్లిగుండ్ల కాలనీ మండలపరిషత ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం కలుషిత ఆహారం తిని 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
కలుషిత ఆహారం తిని 36మందికి అస్వస్థత
ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు... తప్పిన ప్రాణాపాయం
అనంతపురం రూరల్, మార్చి 11: మండలంలోని కక్కలపల్లి పంచాయతీ పిల్లిగుండ్ల కాలనీ మండలపరిషత ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం కలుషిత ఆహారం తిని 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా కిచిడి (పొంగల్), సాంబారు విద్యార్థులకు పెట్టారు. భోజనం చేస్తుండగా అన్నంలో తెల్లటి పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులు భోజనాన్ని పడేశారు. కొంతసేపటికే అన్నం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే బాధిత విద్యార్థులను ఆంబులెన్సలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా వున్నట్లు వైద్యులు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు.

భయాందోళనలో తల్లిదండ్రులు
కలుషిత ఆహారం తిని ఆస్ప్రతిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. స్కూల్కు వెళ్లి ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. అక్కడి నుంచి ఆస్పత్రికి పరుగులు తీశారు. పిల్లలకు ఎలాంటి ప్రాణపాయం లేదని తెలుసుకుని కుదుటపడ్డారు. ఉపాధ్యాయులు, ఏజెన్నీ నిర్వాహకులపై మండిపడ్డారు. పురుగుల అన్నాన్ని పిల్లలకు ఎలా పెట్టారంటూ నిలదీశారు. సమాచారాన్ని వెంటనే తమకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మూడు రోజులుగా పురుగుల అన్నం పెడుతున్నారంటూ పిల్లలు చెబెతూనే ఉన్నారని ఆవేదన చెందారు.

కదిలిన యంత్రాంగం
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఎంపీ తలారి రంగయ్య, జడ్పీచైర్పర్సన బోయ గిరిజమ్మ, డీఈఓ శ్యామూల్, డీఎంహెచఓ, తహసీల్దార్ మోహనకుమార్, ఎంపీడీఓ అలివేలమ్మ, ఎంఈఓ వెంకటస్వామి వైద్యులతో మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇదే సందర్భంలో ఆస్పత్రిలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పిల్లలకు ఇలాంటి పరిస్థితి దాపురించిందంటూ ఆరోపించారు.

ప్రాణాపాయం లేదు
- మల్లేశ్వరి, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆస్పతి, అనంతపురం
విద్యార్థులను ఆస్పతికి తీసుకురావడంతో వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించాం. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదు. పిల్లలను రెండు రోజులు పర్యవేక్షణలో ఉంచుతాం.
పిల్లలను గదుల్లో బంధిస్తారా..?
ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు..?
అధికారులపై మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం
కలుషిత ఆహారం తిని పిల్లలు ఆస్వస్థతకు గురైతే.. వారిని గదుల్లో బంధించడం
ఏమిటని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. ఆస్పత్రిలో ఆమె బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రెండు రోజుల నుంచి పిల్లలకు పురుగుల అన్నం పెడుతున్నా అక్కడి ఉపాధ్యాయులు, అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన పిల్లలను ఆసుపత్రికి తరలించకుండా ఒక గదిలో తలుపులు వేసి బంధించారని ఆమె ఆరోపించారు. పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. ఈ ఘటన చూస్తే పిల్లల ఆరోగ్య విషయంలో ప్రభుత్వానికి ఏపాటి చిత్త శుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. ఘటనపై విచారణ చేసి బాఽధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెతో పాటు మాజీ జడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్, మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు, మాజీ మండల కన్వీనర్ చల్లా జయకృష్ణ, నాయకులు రామాంజనేయులు, శ్రీనివాసులు, ప్రకాష్, బాషా, సాకే వీరా, తెలుగు యువత రాప్తాడు అధ్యక్షులు మద్దినేని కృష్ణ, ఐటీడీపీ అధ్యక్షుడు చల్లానాయుడు, నవీన తదితరులు చిన్నారులను పరామర్శించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన
భోజన ఏజెన్సీని తొలగిస్తాం: డీఈఓ
అనంతపురం విద్య: అనంతపురం రూరల్ మండలం కేకే ఎంపీయూపీ స్కూల్లో మధ్యాహ్న భోజనం తిని 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నరసింహులును సస్పెండ్ చేసినట్లు డీఈఓ శామ్యూల్ తెలిపారు. స్కూల్ ఎండీఎం ఏజెన్సీని తొలగించాలని ఎంఈఓను ఆదేశించామన్నారు. విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు.
మెరుగైన వైద్య సేవలందించాలి : కలెక్టర్
విద్యార్థులకు మెరుగైన వైద్య సేవాలు అందించాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆమె పరామర్శించారు. సంఘటనపై విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. వైద్య సేవలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వరిని చ ర్చించారు. విద్యార్థులకు వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించవద్దని వైద్యులకు సూచించారు.