సాదాబై‘నామాలే’..!

ABN , First Publish Date - 2020-10-30T11:32:45+05:30 IST

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం రెండోసారి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా, ఖమ్మం అర్బన్‌ మండలానికి మాత్రం అవకాశంలేదు.

సాదాబై‘నామాలే’..!

రెండోసారి ప్రకటన వచ్చినా అర్బన్‌ మండలానికి నిరాశే

క్రమబద్ధీకరణకు  వెయ్యి మందికిపైగా ఎదురుచూపు


ఖమ్మం కార్పొరేషన్‌, అక్టోబర్‌ 29: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం రెండోసారి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా, ఖమ్మం అర్బన్‌ మండలానికి మాత్రం అవకాశంలేదు. తొలుత రాష్ట్రంలోని అన్ని మండలాలకు సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఉంటుందని జీవో జారీచేసిన ప్రభుత్వం అనంతరం ఖమ్మం కార్పొరేషన్‌లో విలీనమైనందున ఖమ్మం అర్బన్‌ మండలానికి సాదాబైనామాల క్రమద్ధీకరణ లేదని ప్రభుత్వం మరో జీవో జారీచేసింది. దీంతో వెయ్యికి పైగా సాదాబైనామాలు నిరుపయోగంగా మారాయి.


విలీన పంచాయతీల్లోనే ఎక్కువ

ఖమ్మం కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామపంచాయతీల్లో రైతులు సాదాబైనామాల ద్వారానే భూములు కొనుగోలు చేశారు. ఎప్పుడో కొన్న భూములకు సంబంధించిన పట్టాదారులు చనిపోవటం, వారి వారసులు సదరు భూములను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ముందుకు రాకపోవటం, ఇంకా ఇతరత్రా కారణాలతో కేవలం స్టాంపు పేపర్లమీదనే క్రయ, విక్రయాలు జరిగాయి. సంవత్సరాల తరబడి భూములు స్వాధీనంలో ఉన్నప్పటికీ, అధికారికంగా ఆయా రైతుల పేర్లు లేవు. సాదాబైనామాల క్రమబద్ధీకరణ తరువాతే యూపీఆర్‌ఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రస్తుతం ధరణి వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చినా ఖమ్మం ఆర్బన్‌ మండలానికి మాత్రం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఖమ్మం నగరపాలక సంస్థలో విలీనమైన వెలుగుమట్ల, ధంసలాపురం, మల్లెమడుగులలో ఎక్కువగా సాదాబైమానాల ద్వారానే క్రయ, విక్రయాలు జరిగాయి, ఖానాపురం, పాకబండ, బల్లేపల్లి, తదితర ప్రాంతాల్లో కూడా సాదాబైనామాలే రాసుకున్నారు. ప్రభుత్వం సాదాబైనామాలకు రెండోసారి అవకాశం ఇవ్వగానే రైతులు సంబరపడినప్పటికీ, ఖమ్మం అర్బన్‌ మండలాన్ని మినహాయిస్తూ ప్రభుత్వం జీవో జారీచేయటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే నగరపాలకసంస్థలు, పురపాలక సంస్థల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడే, ఖమ్మం అర్బన్‌ మండలంలో సాదాబైనామాలు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2020-10-30T11:32:45+05:30 IST