సచిన్ టెండూల్కరే ధోనీ పేరును సూచించారు : శరద్ పవార్

ABN , First Publish Date - 2021-03-07T19:57:25+05:30 IST

క్రికెటర్ ధోనీ సారథ్యంలోనే భారత జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు.

సచిన్ టెండూల్కరే ధోనీ పేరును సూచించారు : శరద్ పవార్

న్యూఢిల్లీ : క్రికెటర్ ధోనీ సారథ్యంలోనే భారత జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. భారత క్రికెట్‌కు ఆయన ఎంతో సహకరించారని ప్రశంసించారు. రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో శరద్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఇక తాను కెప్టెన్సీ బాధ్యతల్లో ఉండలేనని, ఆటను ఆ బాధ్యత ప్రభావితం చేస్తోందని ద్రావిడ్ తనతో చెప్పారని పవార్ పేర్కొన్నారు. అయితే కెప్టెన్సీ బాధ్యతలు టెండూల్కర్‌కు అప్పగించాలని తాను కోరానని, అందుకు టెండూల్కర్ నిరాకరించారని గుర్తు చేశారు. అయితే మరి టీమ్‌ను ఎవరు నడిపిస్తారని అడిగితే... సచిన్ క్రికెటర్ ధోనీ పేరును సూచించారని వెల్లడించారు. ‘‘మనకు ఓ ఆటగాడు ఉన్నాడు. భారత జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టేవాడు. ఆయన పేరు ధోనీ’’ అని టెండూల్కర్ తనతో అన్నారని పవార్ తెలిపారు. అప్పుడు కెప్టెన్సీ బాధ్యతలను ధోనీకి అప్పగించామని, ధోనీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టుకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయని పవార్ హర్షం వ్యక్తం చేశారు. 


దేశంలో సౌభ్రాతృత్వం కొరకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. కానీ బీజేపీ మాత్రం దేశంలో మతపరమైన విష బీజాలు నాటుతోందని ఆరోపించారు.సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత 100 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనకు వెళ్తున్నారని, కానీ ఢిల్లీలోనే ఉన్న రైతులను మాత్రం పరామర్శించడం లేదని శరద్ పవార్ ఎద్దేవా చేశారు.

Updated Date - 2021-03-07T19:57:25+05:30 IST