ఐటీ కారిడార్ కేంద్రంగా ఆర్టీసీ సేవలు
ABN , First Publish Date - 2022-06-30T17:54:18+05:30 IST
ఐటీ కారిడార్ కేంద్రంగా ఆర్టీసీ సేవలను విస్తృత పరుస్తోంది. కొవిడ్ పరిస్థితులతో రెండేళ్లుగా వర్క్ఫ్రం హోంతో ఇంటి నుంచి ఉద్యోగాలు చేసిన వేలమంది క్రమంగా ఆఫీస్
20 కి.మీ. వరకు వజ్ర బస్సులు
హైదరాబాద్ సిటీ: ఐటీ కారిడార్ కేంద్రంగా ఆర్టీసీ సేవలను విస్తృత పరుస్తోంది. కొవిడ్ పరిస్థితులతో రెండేళ్లుగా వర్క్ఫ్రం హోంతో ఇంటి నుంచి ఉద్యోగాలు చేసిన వేలమంది క్రమంగా ఆఫీస్ బాటపడుతున్నారు. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఐటీ కారిడార్కు గ్రేటర్లోని పలు ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 3-4 లక్షలమంది రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఐటీకారిడార్కు 20 కి.మీ.దూరంలో ఉన్న చుట్టు పక్కల ప్రాంతాల నుంచి 24 గంటలు మినీ వజ్ర బస్సులు నడిపేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఏయే ప్రాంతాల నుంచి ఎంతమంది ప్రయాణికులు వస్తున్నారనే లెక్కలు తీస్తూ అవసరాలకు అనుగుణంగా సేవలు విస్తరించి ప్రయాణికులను ఆకట్టుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది.
ట్రాఫిక్కు చెక్ పెట్టేలా
లింగంపల్లి, చందానగర్, హైటెక్సిటీ, హాఫీజ్పేట ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి ఐటీసంస్థల సహకారంతో షటిల్ బస్సులు నడుపుతున్నారు. అయినా ప్రయాణికుల రద్దీకి అవి సరిపోవడం లేదు. షటిల్ బస్సుల తరహాలో రద్దీకి సరిపడా మినీ బస్సులు నడిపితే ప్రయాణికులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఆర్టీసీ సేవలు విస్తరించడం ఒక్కటే మార్గమని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు.