ఒక్కటిగా..
ABN , First Publish Date - 2022-01-28T06:24:46+05:30 IST
ఒక్కటిగా..
నేడు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య జేఏసీ సమావేశం
ప్రభుత్వంలో విలీనమైనా పరిష్కారం కాని సమస్యలు
పాత సమస్యలకు తోడు కొత్తవి..
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం
సమ్మె దిశగా సన్నాహాలు
(విజయవాడ, ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్ఎంయూఏ), ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)తో పాటు మరో ప్రాధాన్యత కలిగిన సంఘం ఏపీ పీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) కూటమిగా ఏర్పడ్డాయి. శుక్రవారం జరిగే సమావేశానికి కార్మిక పరిషత్, వైఎస్సార్ ఉద్యోగుల సంఘాలను కూడా ఆహ్వానించాయి. సమావేశానికి రావాల్సిందిగా పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ అగ్రనేతలైన బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేఆర్ సూర్యనారాయణ, కె.వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించారు.
సమస్యలివీ..
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా లబ్ధి కలగకపోగా, గతంలో ఉన్న సదుపాయాలనూ కోల్పోవాల్సి వచ్చింది. ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ వంటి పథకాలు రద్దయ్యాయి. పాత పెన్షన్ పరిస్థితి లేదు. సీపీఎస్ వల్ల ఒరిగేదేమీ లేదు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది రెగ్యులైజేషన్ జరగలేదు. ఎలాంటి సర్వీసు రూల్స్ వర్తింప జేయాలన్నదీ గందరగోళమే. ఆర్టీసీలో సొంత నిధులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు అపరిమిత వైద్య సేవలు అందేవి. ప్రస్తుతం అమలుకు నోచుకుని ప్రభుత్వ హెల్త్ కార్డులే దిక్కయ్యాయి. ఈ హె ల్త్ కార్డులపై ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం చేయటానికి నిరాకరిస్తున్నాయి. సమస్యలను ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన జేఏసీలకు అనుబంధంగా పనిచేస్తున్న ప్రధాన సంఘాలతో పాటు మిగిలిన సంఘాలు సైతం ఒక్కటవ్వాలని నిర్ణయించాయి. ఆ మేరకు అగ్రనేతలంతా శుక్రవారం జరిగే సమావేశంలో ఒకే వేదికపైకి వస్తున్నారు.