నష్టాల ఊబిలో ఆర్టీసీ
ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST
ప్రజా రవాణా శాఖ(పీటీడీ/ఆర్టీసీ) విశాఖ రీజియన్కు గడ్డుకాలం దాపురించింది. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి పీటీడీ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది.
40 శాతానికి మించని ఓఆర్
దారకాబస్స్టేషన్, జూన్ 13 : ప్రజా రవాణా శాఖ(పీటీడీ/ఆర్టీసీ) విశాఖ రీజియన్కు గడ్డుకాలం దాపురించింది. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి పీటీడీ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. గత ఏడాది మార్చి 23న లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. విశాఖ రీజియన్లో 1064 బస్సులు ఉండగా, అందులో 1051 బస్సులు రవాణా సేవలకు వినియోగించేవారు. ఈ బస్సులు రోజుకు 3.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 72 శాతం సగటు ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్)తో సుమారు నాలుగు లక్షల మందికి రవాణా సౌకర్యాలు కల్పించడం ద్వారా రోజుకు కోటి పది లక్షల రూపాయలు ఆదాయం తెచ్చేవి. కరోనా ప్రభావం కారణంగా గత ఏడాది మార్చి 23 నుంచి సుమారు ఆరు మాసాల పాటు బస్సులు నిలిచిపోవడం, ఆ తరువాత అరకొరగా బస్సులు నడిపినా ప్రయాణికుల నుంచి స్పందన లేకపోవడంతో ఆదాయం కనీస స్థాయికి దిగజారింది. వంద బస్సులు నడిపినా, మూడు వందలు బస్సులు నడిపినా 40 శాతానికి మించి ఆక్యుపెన్సీ రేషియో రావడం లేదు. కర్ఫ్యూ కాలంలో ఒక పూట బస్సులు నడపడం వల్ల వస్తున్న కనీస ఆదాయంలో మరికొంత తగ్గిపోయింది. రోజుకు ఆదాయం రూ. పది లక్షలు నుంచి 14 లక్షలు మాత్రమే వస్తున్నది. రోజుకు కోటి పది లక్షల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు రూ.20 లక్షలు నష్టం వచ్చేదని, దీంతో ప్రస్తుతం నష్టాలు మరింత పెరిగాయని అధికారులు వివరించారు.