మద్యం మత్తులో ఐదుగురి మధ్య ఘర్షణ.. సిమెంట్‌ ఇటుకతో ముఖంపై బలంగా కొట్టడంతో..

ABN , First Publish Date - 2020-10-28T16:17:35+05:30 IST

నగరంలోని ఆర్‌టీసీ కాంప్లెక్స్‌లో ఐదుగురి మధ్య మద్యం మత్తులో..

మద్యం మత్తులో ఐదుగురి మధ్య ఘర్షణ.. సిమెంట్‌ ఇటుకతో ముఖంపై బలంగా కొట్టడంతో..

ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో హత్య


నిందితుల్లో మహిళ


మహారాణిపేట(విశాఖపట్నం): నగరంలోని ఆర్‌టీసీ కాంప్లెక్స్‌లో ఐదుగురి మధ్య మద్యం మత్తులో చెలరేగిన ఘర్షణలో ఒకరు హత్యకు గురయ్యారు. నిందితులు నలుగురిలో ఒకరు మహిళ కావడం విశేషం. టూ టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సోమవారం రాత్రి పదిన్నర, పదకొండు గంటల సమయంలో కాంప్లెక్స్‌లోని సిటీ బస్‌స్టేషన్‌ వద్ద సీతమ్మధార అల్లూరి సీతారామనగర్‌ ప్రాంతానికి చెందిన గుదేల అప్పలనాయుడు (40), వన్‌టౌన్‌ జబ్బరుతోట ప్రాంతానికి చెందిన చింతాడ అనూరాధ (43), చెన్నాదాసు (47), నెహ్రూబజార్‌ ప్రాంతానికి చెందిన పిల్లా అప్పారావు (47), ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వుంటున్న బిచ్చగాడు దాలి వెంకటరెడ్డి (55) కలసి మద్యం తాగారు.


అయితే అప్పలనాయుడు దౌర్జన్యంగా తన దగ్గర వున్న డబ్బును లాక్కుంటున్నాడని అనురాధ మిగిలిన ముగ్గురికి ఫిర్యాదు చేసింది. దీంతో వారి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో ఒకరు సమీపంలో వున్న సిమెంట్‌ ఇటుకతో అప్పలనాయుడు ముఖంపై బలంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన అప్పలనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. అక్కడికి సమీపంలో వున్న వారు పోలీసులకు సమాచారం అందించడంతో, హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - 2020-10-28T16:17:35+05:30 IST