ఉగాదిలోపు రూ. లక్ష రుణ మాఫీ చేస్తాం

ABN , First Publish Date - 2021-10-19T05:59:48+05:30 IST

ఉగాది పండుగలోపు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

ఉగాదిలోపు రూ. లక్ష రుణ మాఫీ చేస్తాం
హుజూరాబాద్‌ మండలం కనుకులగిద్దెలో మహిళలతో ముచ్చటిస్తున్న మంత్రి హరీష్‌రావు

- సొంత జాగా ఉన్న వారికి రూ. 5లక్షలతో ఇళ్లు కట్టించి ఇస్తాం

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

హుజూరాబాద్‌, అక్టోబరు 18: ఉగాది పండుగలోపు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం హుజూరాబాద్‌ మండలంలోని కనుకులగిద్దె, జూపాక, బొత్తలపల్లి, శాలపల్లి-ఇందిరానగర్‌, రాజాపల్లి, రంగాపూర్‌, రాంపూర్‌, చెల్పూర్‌ గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ మహిళలందరూ ఈ నెల 30న ఓటు వేసేందుకు వెళ్లే ముందు సిలిండర్‌కు దండం పెట్టి.. బీజేపీని బొంద పెట్టాలన్నారు. ఈటల రాజేందర్‌ తన స్వార్థం కోసం రాజీనామా చేశారని, తాను అంటించుకున్న బురదను అందరికి పూసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ రాకపోతే, కేసీఆర్‌ లేకపోతే ఎస్సారెస్పీ కాలువలో గోదావరి నీళ్లు వచ్చేవా అన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు.  హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితులందరికి దళితబంధు పథకం వస్తుందని, ఎవరూ అధైర్య పడవద్దన్నారు. ప్రతి యూనిట్‌ గ్రౌండ్‌ అయ్యే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఈటల మనుషులు దళితబంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దన్నారు. వానకాలం పంటలను కేసీఆర్‌ కొంటారని, రైతులెవరూ అధైర్య పడవద్దన్నారు. పెద్ద నోట్ల రద్దు చేసి బీజేపీ ప్రజలను గోస పెట్టారన్నారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపిస్తే నెలకు రెండు సార్లు వచ్చి హుజూరాబాద్‌ను అభివృద్ధి చేస్తానని, 5వేల ఇళ్లు కడుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎంపీపీ ఇరుమల్ల రాణి, పొనగంటి శ్రావణ్‌కుమార్‌, స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్‌ మండలం కనుకులగిద్దె గ్రామంలో ప్రచారంలో భాగంగా నేలపై కూర్చున్న మహిళలను చూసి మంత్రి హరీష్‌రావు వారితో ముచ్చటించారు. పింఛన్లు, రేషన్‌ బియ్యం వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2021-10-19T05:59:48+05:30 IST