ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తామని రూ.75 లక్షలు టోకరా

ABN , First Publish Date - 2022-06-26T06:15:42+05:30 IST

ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తామని కోల్‌కతాకి చెందిన వి.ఉషారాణి రూ.75 లక్షలు తీసుకుని మోసం చేసిందని శనివారం రాత్రి బుచ్చెయ్యపేట పోలీసులకు బాధిత నిరుద్యోగులు, వారి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.

ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తామని రూ.75 లక్షలు టోకరా
పోలీసు స్టేషన్‌లో నకిలీ అపాయింట్‌మెంట్‌ లేటర్లు చూపుతున్న నిరుద్యోగులు, తల్లిదండ్రులు

నిరుద్యోగుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు


బుచ్చెయ్యపేట, జూన్‌ 25: ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తామని కోల్‌కతాకి చెందిన వి.ఉషారాణి రూ.75 లక్షలు తీసుకుని మోసం చేసిందని శనివారం రాత్రి బుచ్చెయ్యపేట పోలీసులకు బాధిత నిరుద్యోగులు, వారి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలానికి చెందిన తీగాడ నాయుడు, కంఠంరెడ్డి గణేశ్‌, యలమంచిలి శ్రీను, డేగెల రాజు, సాలపు వెంకటేష్‌, గాడి అనిల్‌, ఉల్లింగల యుగంధర్‌ తదితరులు ఆర్మీ ఉద్యోగాల కోసం ఫిబ్రవరి నెలలో జార్ఘండ్‌ రాష్ట్రంలోని రాంచీలో పరీక్షలు రాశారు. ఎస్‌.రాయవరానికి చెందిన ఆర్మీ ఉద్యోగి రాయి శ్రీను పరీక్షలు రాసిన నిరుద్యోగులను కలిసి కోల్‌కతాకి చెందిన వి.ఉషారాణి బాక్‌ డోర్‌ ద్వారా ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తుందని, ఒక్కో పోస్టుకు రూ.8లక్షలు చెల్లించవలసి ఉంటుందని తెలిపాడు. ఈ మేరకు నిరుద్యోగులు ఉషారాణికి రూ.75 లక్షలు చెల్లించారు. మార్కుల లిస్టులను కూడా ఇచ్చారు. రిజల్ట్‌లో పేర్లు లేకపోవడంతో గట్టిగా నిలదీసి, ఇచ్చిన డబ్బులు, సర్టిఫికెట్లు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో వారికి ఉషారాణి అపాయింట్‌మెంట్‌ లెటర్లను చేతిలో పెట్టింది. అవి నకిలీవి అని తేలడంతో నిరుద్యోగులు నగదు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం మానుకుంది. దీంతో నిరుద్యోగులు ఆర్మీ ఉద్యోగి రాయి శ్రీనును కలిసి కోల్‌కతా వెళ్లారు. డబ్బులు, సర్టిఫికెట్లు ఇవ్వమని అడగ్గా, విశాఖలో ఉన్నాయని చెప్పి, తన అనుయాయుడైన రాఖీని తీసుకెళ్లితే నగదు, సర్టిఫికెట్లు ఇచ్చేస్తాడని ఉషారాణి తెలిపింది. దీంతో రాఖీతో కలిసి విశాఖకి వచ్చారు. నగదు ఇవ్వాలని కోరగా, ఉషారాణి తమ అక్కౌంట్‌లో రూ.6.9 లక్షలు వేసి, మిగతా నగదు రెండు రోజులో వేస్తానని, అప్పటివరకు రాఖీ మీ దగ్గరే ఉంటాడని తెలిపింది. అయితే ఆమె ముందుగా వేసుకున్న పథకం మేరకే తమతో రాఖీని పంపించడం, తమ అక్కౌంట్‌లో నగదు వేయడం చేసిందన్నారు. రాఖీని కిడ్నాప్‌ చేసి, తాము అడిగిన డబ్బు ఇచ్చినా రాఖీని వదలేదని ఉషారాణి తమపై తప్పుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారన్నారు. బాధితులైన తమకు న్యాయం చేయాలని, ఉద్యోగాలిపిస్తామని వసూలు చేసిన నగదు, సర్టిఫికెట్లను ఉషారాణి నుంచి ఇప్పించి, ఆమెపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో నిరుద్యోగులు కోరారు. 


Updated Date - 2022-06-26T06:15:42+05:30 IST