మారుమూల పల్లెలకు రూ.164.24 కోట్లతో రోడ్లు
ABN , First Publish Date - 2022-01-25T06:01:24+05:30 IST
ఏజెన్సీలో మారుమూల గిరిజన పల్లెలకు రూ.164.24 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడతామని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు.
జూమ్ కాన్ఫరెన్స్లో ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ
పాడేరు, జనవరి 24: ఏజెన్సీలో మారుమూల గిరిజన పల్లెలకు రూ.164.24 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడతామని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు. మన్యంలో రోడ్ల నిర్మాణంపై గిరిజన సంక్షేమ శాఖ, పీఆర్ ఇంజనీరింగ్ శాఖలు, ఉపాధి హామీ పథకం అధికారులతో సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్బంగా పీవో గోపాలక్రిష్ణ మాట్లాడుతూ.. ఏజెన్సీలో రోడ్డు సదుపాయం లేని పల్లెలకు మిషన్ కనెక్ట్ పాడేరు పేరిట రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా మిషన్ కనెక్ట్ పాడేరుకు రూ.120.24 కోట్లు, ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలకు రూ.44 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఆయా రోడ్ల నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి సాంకేతికపరమైన అనుమతులను పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను పీవో ఆదేశించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు ముమ్మరం చేయాలన్నారు. మిషన్ కనెక్ట్ పాడేరులో రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, తాగునీటి పథకాలు నిర్మిస్తామన్నారు. రోడ్ల నిర్మాణాలు ప్రారంభానికి ముందుగా ఆయా ప్రాంతాల్లోని ఏఈఈలు పర్యటించి సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలను వినియోగించుకోవాల న్నారు. గ్రామీణా ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద జరుగుతున్న పనులను ఎంపీ డీవోలు, ఉపాధి హామీ ఏపీవోలు విధిగా పర్యవేక్షించాలన్నారు. అలాగే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించి, పాఠశాల భవనాలు, డార్మెంటరీ, కిచెన్ కమ్ డైనింగ్, సిబ్బంది నివాస గృహాలు పురోగతిపై ఆరా తీశారు. అలాగే గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులు వెంటనే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఎస్ఈ ఎస్.శ్రీనివాస్, టీడబ్ల్యూ ఈఈ డీవీఆర్ఎం.రాజు, అరకులోయ టీడబ్ల్యూ ఈఈ కె.వేణుగోపాల్, పీఆర్ ఈఈ కె.మాలకొండయ్య, డీఈఈలు, ఏఈఈలు, వెలుగు, ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు.