అతివేగానికి ముగ్గురి బలి

ABN , First Publish Date - 2021-10-20T06:17:28+05:30 IST

అతివేగం ముగ్గురిని బలిగొంది. నెల్లూరు జిల్లా కావలి సమీపంలో మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముందు వెళుతున్న కంటైనర్‌ లారీని అధిగమించే క్రమంలో ఓ కారు వెనుక నుంచి వేగంగా ఢీకొంది.

అతివేగానికి ముగ్గురి బలి
మృతురాలు భార్గవీలత(ఫైల్‌ ఫొటో)

కావలి వద్ద కంటైనర్‌ను ఢీకొన్న కారు

మహిళా టీచర్‌ సహా ముగ్గురి దుర్మరణం 

చనిపోయిన వారిలో అత్తాకోడళ్లు


కావలి రూరల్‌, అక్టోబరు 19: అతివేగం ముగ్గురిని బలిగొంది. నెల్లూరు జిల్లా కావలి సమీపంలో మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముందు వెళుతున్న కంటైనర్‌ లారీని అధిగమించే క్రమంలో ఓ కారు వెనుక నుంచి వేగంగా ఢీకొంది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం పాలవగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.మృతుల్లో ఇద్దరు తిరుపతివాసులు కాగా ఒకరు నెల్లూరు జిల్లా కోవూరు వాసి.కావలి పట్టణం ముసునూరు సమీపంలో కోల్‌కత్తా-చెన్నై జాతీయ రహదారి ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై  జరిగిన ఈ ప్రమాద వివరాలు పోలీసుల కథనం మేరకు......తిరుపతి నగరం పద్మావతిపురం లోని కేఆర్‌ నగర్‌కు చెందిన పల్లమాల రవి వ్యాపారవేత్త. అతని భార్య భార్గవీలత నిండ్ర జడ్పీ హౌస్కూల్లో ఫిజిక్స్‌ టీచర్‌గా పని చేస్తున్నారు.తల్లి రాజేశ్వరమ్మ, భార్యతో కలసి  ప్రకాశం జిల్లా ఉలవపాడులో జరిగిన శుభకార్యంలో పాల్గొనేందుకు రవి వెళ్లారు.మంగళవారం మధ్యాహ్నం కారులో  తిరుగు పయనమయ్యారు.కారులో వారి బంధువైన కోవూరుకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి ఇరుగు రమణయ్య,ఆయన మనవడు ఎక్కారు.వీరు ప్రయాణిస్తున్న కారు  ముసునూరు సమీపంలోని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ముందు వెళ్తున్న కంటైనర్‌ను అధిగమించే క్రమంలో లారీని వెనుక వైపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కాగా  డ్రైవింగ్‌ చేస్తున్న పల్లమాల రవి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. అతని భార్య భార్గవీలత (40), తల్లి రాజేశ్వరమ్మ(70), కావలి ఆర్టీసీ డిపోలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైరైన  రమణయ్య(65) కారులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు.రమణయ్య కుటుంబ సభ్యులు బస్సులో వెళ్లగా తాతతో కలసి కారులో ఎక్కిన ఆయన కుమార్తె రజని కుమారుడు వాకాడుకు చెందిన బాలుడు సువినాష్‌ సాయి (8) గాయాలేవీ లేకుండా మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.ప్రమాద విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ప్రసాద్‌ రవిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కావలి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకే తరలించారు.కావలి రూరల్‌ సీఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







Updated Date - 2021-10-20T06:17:28+05:30 IST