రెవెన్యూ కార్యాలయంలో కలకలం
ABN , First Publish Date - 2020-07-11T10:36:49+05:30 IST
తన పొలాన్ని కొందరు ఆక్రమించుకొని దున్నుతున్నారని ఓ మహిళా రైతు పెట్రోల్ బాటిల్తో రెవెన్యూ కార్యాలయానికి రావడం కలకలం రేగింది.
పెట్రోల్ బాటిల్తో వచ్చిన మహిళా రైతు
వంగూరు, జూలై 10 : తన పొలాన్ని కొందరు ఆక్రమించుకొని దున్నుతున్నారని ఓ మహిళా రైతు పెట్రోల్ బాటిల్తో రెవెన్యూ కార్యాలయానికి రావడం కలకలం రేగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం మిట్టసదగోడు గ్రామానికి చెందిన సరస్వతమ్మకు 1.20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఇదే గ్రామానికి చెందిన శ్రీను, రమేష్, రవిలు ఆక్రమించుకొని దున్నుతున్నారు.
దీంతో సరస్వతమ్మ తనకు న్యాయం చేయాలని శుక్రవారం వంగూరులోని రెవెర్యూ కార్యాలయానికి పెట్రోల్ బాటిల్ తీసుకెళ్లి ఓ మూలకు కూర్చుంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ బాలకృష్ణ కార్యాలయానికి చేరుకొని, ఆమెను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పొలాన్ని అక్రమంగా దున్నుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో, ఎస్ఐ ఆమెను తీసుకొని పొలం వద్దకు వెళ్లాడు. దౌర్జన్యంగా భూమిని దున్నుతున్న వారిని మందలించి, అక్కడి నుంచి పంపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.