సకాలంలో స్పందించారు.. ప్రాణం కాపాడారు

ABN , First Publish Date - 2021-06-24T05:28:21+05:30 IST

సకాలంలో స్పందించారు.. ప్రాణం కాపాడారు

సకాలంలో స్పందించారు.. ప్రాణం కాపాడారు
అపస్మారకస్థితిలో ఉన్న ప్రవీణ్‌ను వీపుపై ఎత్తుకుని ఆస్పత్రికి తరలిస్తున్న కీసర పోలీసులు

  • ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని రక్షించిన కీసర పోలీసులు

కీసర రూరల్‌ : కీసర పోలీసులు మెరుపువేగంతో స్పందించి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు. నక్క ప్రవీణ్‌(24) అనే యువకుడు పాల వ్యాపారం చేసుకుంటూ మేడ్చల్‌ జిల్లా కీసర గ్రామపంచాయతీ అనుబంధ గ్రామం కీసరదాయరలో కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. రోజూవారీగా బుధవారం వ్యాపార పనులు ముగించుకుని, ఉదయం 7గంటలకు ఇంటికి చేరుకున్నాడు. ఆవుల సంరక్షణకు షెడ్డు నిర్మాణం కోసం లక్ష రూపాయలు ఇవ్వాల్సిందిగా తల్లితో వాదనకు దిగాడు. డబ్బులు సర్దుబాటు చేసేందుకు తల్లి నిరాకరించింది. దీంతో ప్రవీణ్‌ కోపంతో ఊగిపోతూ, ద్విచక్రవాహనంపై ఇంటినుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 9గంటలకు తన అన్నకు ఫోన్‌ చేసి ‘ఆత్మహత్య చేసుకుంటున్నాను, అమ్మానాన్నలతో కలిసి సంతోషంగా ఉండు’ అని ఫోన్‌ పెట్టేశాడు. కంగారుపడిన అన్న నవీన్‌ తన మిత్రులకు, గ్రామస్థులకు విషయం తెలిపాడు. ప్రవీణ్‌ ఆచూకీ కోసం గ్రామం చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవటంతో డయల్‌-100కు ఫోన్‌ చేసి విషయాన్ని తెలిపారు. వెంటనే కీసర పోలీసులు స్పందించారు. ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటుచేసారు. ఈ క్రమంలో ప్రవీణ్‌కు ఫోన్‌ చేయగా ఎంతకూ ఎత్తలేదు. ఎట్టకేలకు మధ్యాహ్నం 12గంటలకు ఫోన్‌ లోకేటర్‌ ద్వారా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపురం గ్రామంలోని కొండ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి ప్రవీణ్‌ అచేతనంగా పడి ఉన్నాడు. అతడి పక్కన మాజా కూల్‌డ్రింక్‌ బాటిల్‌, పురుగుల మందు డబ్బా ఉన్నాయి. పోలీసులు వెంటనే వారి వాహనంలో నాగారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు ప్రాణాలకు ప్రమాదం లేదని తెలిపారు. కాగా సకాలంలో స్పందించి తమ కుమారుడి ప్రాణాలు కాపాడినందుకు కుటుంబసభ్యులు పోలీసులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-06-24T05:28:21+05:30 IST