ఆర్‌డబ్ల్యూఎస్‌లో రాజీనామాలు..!

ABN , First Publish Date - 2022-05-15T06:16:39+05:30 IST

ఆర్‌డబ్ల్యూఎస్‌లో రాజీనామాలు..!

ఆర్‌డబ్ల్యూఎస్‌లో రాజీనామాలు..!

అధికారుల తీరుతో అసోసియేషన్‌ నేతల అసంతృప్తి 

దొంగ పనులకు మద్దతు పలకలేక పదవులకు గుడ్‌బై


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌)లో రక్షిత మంచినీటి పథకాల అవినీతి రోజుకో మలుపు తిరుగుతోంది. అవినీతి అధి కారుల చర్యలతో మనస్థాపం చెంది, నైతిక బాధ్యత వహిస్తూ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అట్లూరి వెంకటేశ్వరరావు, శ్రీకాంత్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. 

అధికారుల తీరుతో విసిగిపోయి.. 

తాము చేసిన దొంగ పనులకు అసోసియేషన్‌ నేతల మద్దతు కోరుతూ కొందరు అధికారులు ఇటీవల లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల మద్దతు కోరటం, రికార్డులు ట్యాంపరింగ్‌ చేయటం, అసోసియేషన్‌  సూచనలను ఖాతరు చేయకపోవటం వంటి చర్యలతో అసంతృప్తి చెందే ఈ రాజీనామాలు చేశారని తెలుస్తోంది. ఆరోగ్య కారణాలు,  అధికారులను సమన్వయం చేయలేకపోతున్నామని చెప్పినప్పటికీ అవినీతి అధికారుల దుందుడుకుతనంతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అధికారులు తప్పు చేశారని అసోసియేషన్‌ నేతలు నిర్ధారణకు వచ్చి ఇలా చేశారని కూడా సమాచారం. అలాగే, ఈ వ్యవహారంలో ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు వస్తున్నాయని, తమను చెడుగా చూపే ప్రయత్నం చేస్తున్నారంటూ చేసిన ఆరోపణలపై కూడా అసోసియేషన్‌ నేతలు అధికారులను మందలించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అసోసియేషన్‌ నేతలు కూడా రంగంలోకి దిగి అవినీతి అధికారులకు మద్దతుగా కాంట్రాక్టర్లతో మంతనాలు సాగించటం, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) ఆదేశాల మేరకు కాంట్రాక్టర్లకు తాయిలాలు ఎర వేయడం కూడా బహిర్గతమైంది. దీంతో దొంగ పనులు చేసిన అధికారులను ఆర్‌డబ్ల్యూఎస్‌ అసోసియేషన్‌ వెనకేసుకు రావడంతో అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో జిల్లా అసోసియేషన్‌ నేతలు సంఘంలో ఉండి చెడ్డపేరు తెచ్చుకోవటం కంటే రాజీనామాలు చేయటం మంచిదన్న భావనకు వచ్చి రాజీనామా లేఖలను రాష్ట్ర అగ్రనాయకత్వానికి పంపించారు. 

విచాణ ఏమైంది?

ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాల్సిన ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) జిల్లాస్థాయిలోని సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) విచారణకు ఆదేశించారు. తిరిగి ఈఎన్‌సీ మౌఖిక ఆదేశాలతోనే ఆ విచారణ నిలిచిపోయిందని తెలిసింది. అనంతరం జిల్లా క్వాలిటీ కంట్రోల్‌-విజిలెన్స్‌ అధికారి హరమోహన్‌ దీనిపై విచారణ జరపాల్సి ఉండగా, ఆయన ఇంకా మొదలు పెట్టనేలేదు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, జిల్లాకు సంబంధించిన అంశం కావటంతో, వేరే జిల్లాకు చెందిన వారితో విచారణ జరిపించవచ్చేమోనని చెప్పారు. దీనిని బట్టి చూస్తే విచారణ వ్యవహారం కూడా సాగదీస్తున్నారని అర్థమవుతోంది. కాగా, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నెక్కటి సత్యనారాయణ వివరణ ఇస్తూ అంతర్గతంగా విచారణ జరుగుతోందని, ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక అందజేశామని, క్వాలిటీ కంట్రోల్‌-విజిలెన్స్‌ విభాగం విచారణ నడుపుతోందని, నివేదికలను ఈఎన్‌సీ కార్యాలయానికి పంపుతున్నామని చెప్పారు.

Updated Date - 2022-05-15T06:16:39+05:30 IST