రేపల్లె.. రెవె‘న్యూ’ డివిజన్
ABN , First Publish Date - 2022-08-06T05:13:55+05:30 IST
రేపల్లెను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం శుక్రవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
78 రోజుల తర్వాత ఫైనల్ గెజిట్
ఎట్టకేలకు నెరవేరిన రేపల్లెవాసుల కల
బాపట్ల, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రేపల్లెను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం శుక్రవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జిల్లాలో మూడో రెవెన్యూ డివిజన్గా రేపల్లె 9 మండలాలతో కొలువుదీరింది. రేపల్లెను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తూ మే 17న ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువును అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది. జూన్ 17తో ఆ వ్యవధి ముగిసినప్పటికీ ప్రభుత్వం తుది గెజిట్ విడుదల చేయలేదు. తుది నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆర్డీవోను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో రేపల్లెను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇవ్వడంతో తీరప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరినట్లైంది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, భట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు, అమర్తలూరు, చుండూరు, నగరం మండలాలతో రేపల్లె రెవెన్యూ డివిజన్గా కార్యకలాపాలు కొనసాగించనుంది. రేపల్లె రెవెన్యూ డివిజన్ రావడంతో జిల్లా కేంద్రమైన బాపట్ల డివిజన్ ఆరు మండలాలకే పరిమితమైంది. గతంలో ఉన్న బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలేనికి తోడు పర్చూరు, మార్టూరు యద్ధనపూడితో బాపట్ల రెవెన్యూ డివిజన్గా సేవలందించనుంది.
కల నెరవేరింది.. మరి వసతులు
రేపల్లె రెవెన్యూ డివిజన్ కావాలన్న అక్కడి ప్రజల ఆకాంక్ష అయితే నెరవేరింది కానీ అందుకు కావాల్సిన వసతులు, సిబ్బంది ఇతరాత్ర సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. ప్రస్తుతానికి ఆర్డీవోను నియమించి కార్యాలయాన్ని ఎంపిక చేశారే తప్ప నిబంధనల ప్రకారం ఉండాల్సిన నిష్పత్తిలో సిబ్బందిని కేటాయించలేదు. రికార్డులను రెవెన్యూ డివిజన్గా అనుగుణంగా ఆన్లైన్ చేయాలి. ఈ ప్రక్రియలన్నీ ప్రణాళికబద్ధంగా జరిగితేనే ప్రజలకు డివిజన్ ఫలాలు అందుతాయి లేదంటే గందరగోళానికి దారి తీసే అవకాశం ఉంటుంది.