యుద్ధప్రాతిపదికన అన్నమయ్య గేట్ల పునరుద్ధరణ
ABN , First Publish Date - 2020-11-30T05:09:44+05:30 IST
అన్నమయ్య ప్రాజెక్టు గేట్లను తిరిగి పునరుద్ధరించారు. సాంకేతిక లోపాలు ఏర్పడ్డ గేట్లను పునరుద్ధరించి వరద నీటిని మళ్లీ ప్రాజెక్టులో నింపుతున్నట్లు కలెక్టర్ హరికిరణ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిరిగి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరు నింపుతున్నట్లు కలెక్టర్ హరికిరణ్ అధికారిక ప్రకటన
సోమవారం నాటికి 2టీఎంసీల నీటిని నింపనున్నట్లు వెల్లడి
రాజంపేట, నవంబరు 29: అన్నమయ్య ప్రాజెక్టు గేట్లను తిరిగి పునరుద్ధరించారు. సాంకేతిక లోపాలు ఏర్పడ్డ గేట్లను పునరుద్ధరించి వరద నీటిని మళ్లీ ప్రాజెక్టులో నింపుతున్నట్లు కలెక్టర్ హరికిరణ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నాటికి రెండు టీఎంసీల నీటిని ప్రాజెక్టులో నింపనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టులోకి 33 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తోందని, సోమవారం నాటికి రెండు టీఎంసీల నీటిని నింపుతామని తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యం 2.4 టీఎంసీలు కాగా, డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకొని 2 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామన్నారు.
ప్రాజెక్టులో నిల్వ చేసిన నీరు వృథాగా పోయిందని రైతులు బాధపడాల్సిన పని లేదని, యుద్ధప్రాతిపదికన గేట్లను పునరుద్ధరించి ప్రాజెక్టులో నీటిని నింపుతున్నామని వెల్లడించారు. ప్రాజెక్టుల మాజీ సలహాదారు, మెకానికల్ గేట్స్ నిపుణులు కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రాజెక్టు గేట్లను ఏర్పాటు చేసిన స్వప్ణ కనస్ట్రక్షన్స కంపెనీ, మొరాయించిన గేట్లను తిరిగి పునరుద్ధరించిందన్నారు. రాష్ట్ర మెకానికల్ ఈఈ శేఖరయ్య, స్థానిక ఈఈలు రవికిరణ్, రమేష్ నేతృత్వంలో గేట్ల పునరుద్ధరణ జరిగిందని తెలిపారు. కాగా కలెక్టర్ ఆదేశాలతోనే వరద నీటితో నిండిన డ్యామ్ గేట్లను ఎత్తడం జరిగిందని, లేకపోతే డ్యామ్కు ముప్పు వాటిల్లేదని ఇరిగేషన ఈఈ వెంకట్రామయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.