రిజిస్ట్రేషన్ లక్ష్యాలకు గండి
ABN , First Publish Date - 2020-06-01T10:24:19+05:30 IST
లక్ష్యాల సాధనలో రిజిస్ట్రేషన్ శాఖ వెనుకబడింది రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోవడటంతో
కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం
ఆగిన లావాదేవీలు
కరోనా ఎఫెక్ట్
నెల్లూరు(హరనాథపురం), మే 31 : లక్ష్యాల సాధనలో రిజిస్ట్రేషన్ శాఖ వెనుకబడింది రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోవడటంతో రిజిస్ట్రేషన్లు చేసుకొనేవారే కరువయ్యారు. దీంతో నగదు లావాదేవీలకు బ్రేక్ పడింది. ఇందుకు కారణం కరోనా ప్రభావం అని చెప్పక తప్పదు.
జిల్లాలో అధికార, అనధికారికంగా సుమారు 1400ల వరకు లే అవుట్లు ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్తో పాటు సూళ్లూరుపేట, గూడూరు, కావలి, నాయుడుపేట, ఆత్మకూరు, తడ, ముత్తుకూరు, బుచ్చి తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేశారు. ఇవికాక జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్థలాల, భూముల అమ్మకాలు జరుగుతుంటాయి.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు తమ ఎస్టేట్లలో భవన నిర్మాణాలు చేశారు. కొన్నింటిలో నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయి. రియల్భూం కొనసాగే రోజుల్లో ఉద్యోగులు, పారిశ్రామికవేత్త్తలు, ఎందరో వ్యాపారులు భూములు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చారు. సాధారణ పరిస్థితులలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ప్లాట్ల అమ్మకాలు జరుగుతుంటాయి. కరోనా లాక్డౌన్ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆర్థిక లావేదేవీలు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్శాఖ కార్యాలయాలు కూడా మూత పడ్డాయి.
ఆదాయానికి గండి
రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే రిజిస్ట్రేషన్శాఖ ఆదాయం ఏటికాయేడు పెరుగుతుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్శాఖ కార్యాలయాలు తెరిచినా రిజిస్ట్రేషన్లు చేయించుకొనే వారు రాక పోవటంతో ఆ శాఖ ఆ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.అప్పట్లో రోజుకు రూ.1.50 కోట్ల ఆదాయం ఆశాఖకు వచ్చేది. ప్రస్తుతం 10 లక్షల ఆదాయం కూడా రావటం లేదు.
నెరవేరని లక్ష్యం
2019-20లో జిల్లాలోని ఆశాఖకు రూ.424.54 కోట్ల లక్ష్యాన్ని విధించగా రూ.314.62 కోట్ల లక్ష్యాన్నే ఆశాఖ సాధించగలిగింది. ఈ లక్ష్య సాధన శాతం 74.11గా ఉంది. గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈ శాతం చాలా తక్కువగా ఉంది.
కొత్త లక్ష్యాలు త్వరలో ప్రకటన
జిల్లాకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్ష్యాలను త్వరలో తమ శాఖ ప్రకటిస్తుంది. గత సంవత్సరాలతో పోలిస్తే 2019-20లో లక్ష్యసాధన తక్కువగా ఉంది. లాక్డౌన్తో నూరుశాతం లక్ష్యసాధన పూర్తి కాలేదు.
- కే అబ్రహం, డీఐజీ, రిజిస్ట్రేషన్లు స్టాంపులశాఖ