విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ
ABN , First Publish Date - 2022-01-24T06:36:59+05:30 IST
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆధ్వర్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అవసరాలు, చార్జీల పెంపుపై రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో నిర్వహించతలపెట్టిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ సోమవారం ప్రారంభంకానున్నది.
నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ
ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాట్లు
సీతమ్మధార, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆధ్వర్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అవసరాలు, చార్జీల పెంపుపై రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో నిర్వహించతలపెట్టిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ సోమవారం ప్రారంభంకానున్నది. శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు ఈపీడీసీఎల్కు సంబంధించి నగరంలోని కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రాజగోపాల్రెడ్డి, ఠాకూర్ రామ్సింగ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. కొవిడ్ నేపథ్యంలో ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను వర్చువల్గా స్వీకరిస్తారు. అభ్యంతరాలు తెలిపే వారు సమీప విద్యుత్ సర్కిల్ కార్యాలయం, డివిజన్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు. 24, 25, 27 తేదీల్లో రోజూఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి రెండు గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీ ఇంధనశాఖ, ఏపీ ట్రాన్స్కో, ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొంటారు.