ఎర్రమట్టి తరలింపు అడ్డగింత
ABN , First Publish Date - 2021-05-11T04:52:03+05:30 IST
మునిసిసాలిటీ కేంద్రమైన వడ్డేపల్లి సమీపంలోని మాధవస్వామి గట్టునుంచి ఎర్రమట్టి తరలింపును సోమవారం గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు.
వడ్డేపల్లి, మే10: మునిసిసాలిటీ కేంద్రమైన వడ్డేపల్లి సమీపంలోని మాధవస్వామి గట్టునుంచి ఎర్రమట్టి తరలింపును సోమవారం గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. మట్టి తరలింపునకు కాంట్రాక్టర్ సంబంధిత అధికారులతో అనుమతులు తెచ్చుకున్నా వారు అంగీకరించలేదు. మునిసిపాలిటీ పరిధిలోని రోడ్లకు మట్టి వేసుకోవడానికి అనుమతులు ఇవ్వని అధికారులు, ఎక్కడో ఉన్న బొంకూర్ బ్రిడ్జి నిర్మాణానికి మట్టి తరలించేందుకు మాత్రం అనుమతులు ఎలా ఇస్తారని అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు జోక్యం చేసుకొని సర్దిచెప్పినా గ్రామస్థులు పట్టువీడలేదు. ఇక్కడ కాకుండా బుడమర్సు దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద ఎర్రమట్టి తీసుకోవాలని మునిసిపల్ చైర్పర్సన్ కరుణ, కౌన్సిలర్ రవి, నాయకులు కాంట్రాక్టర్కు చెప్పడంతో సమస్య సద్దు మణిగింది. ఎలాంటి గొడవలు జరగకుండా ఎస్ఐ శ్రీహరి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్చార్జీ తహసీల్దార్ సాగర్మధుకర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు గడ్డంశ్రీను, మహిపాల్ రెడ్డి, తోటశ్రీను, బాబి తదితరులు పాల్గొన్నారు.