అవును.. నిజమే!

ABN , First Publish Date - 2021-07-07T06:57:41+05:30 IST

పీలేరు మండలంలోని..

అవును.. నిజమే!

పీలేరులో ‘రియల్‌’ దందా నిజమే!

నల్లారి, చంద్రబాబు పాలనలోనే ఎక్కువ

సమగ్ర విచారణ జరిపించండంటూ సీఎంకు చింతల లేఖ


తిరుపతి(ఆంధ్రజ్యోతి): పీలేరు మండలంలోని ప్రభుత్వ పొరంబోకు భూముల్లో జరుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ దందాపై సమగ్ర విచారణ జరిపించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. లేఖ ప్రతిని మంగళవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం అధికారులకు స్వయంగా అందజేశారు. పీలేరు మండలం గూడరేవుపల్లె, ఎర్రగుంట్లపల్లె, కాకులారంపల్లె, ముడుపులవేముల, బోడుమల్లువారిపల్లె పంచాయతీల పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ పొరంబోకు భూములు అన్యాక్రాంతమయ్యాయని లేఖలో వెల్లడించారు. పెద్దఎత్తున జరిగిన ప్రభుత్వ భూముల కుంభకోణంలో రియల్టర్లు, అధికారులు, కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం వుందని పేర్కొన్నారు. ఈ ఆరు పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూములు రూ. వందల కోట్లు ఖరీదు చేసే అత్యంత విలువైనవని పేర్కొన్నారు.


ఈ భూముల్లో అక్రమ లే అవుట్లు వేసి, ఇళ్ళ స్థలాలను అమాయక ప్రజలకు విక్రయించారని వివరించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వ భూములని తెలియక కొనుగోలు చేసి మోసపోయారని వెల్లడించారు. ప్రభుత్వ పొరంబోకు భూములను లే అవుట్లుగా మార్చి ప్లాట్లు వేసి విక్రయించిన వ్యవహారంలో అధికారుల పాత్ర కూడా వుందని స్పష్టం చేశారు. ఈ అక్రమాలు 2009-2014 మధ్య అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనూ, 2014-19 నడుమ టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌  ఛైర్మన్‌గా, పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి వ్యవహరించిన కాలంలోనూ జరిగాయని ఆరోపించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2019-21 మధ్య కూడా పెద్దఎత్తున ప్రభుత్వ భూములను ప్లాట్లు వేసి అమ్ముకున్నారని టీడీపీ నాయకులు ఆరోపించిన విషయాన్ని చింతల తన లేఖలో ప్రస్తావించారు. వాటిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని సీఎంను కోరారు.


2009 నుంచీ 2021 వరకూ జరిగిన ఆక్రమణలపై విజిలెన్స్‌ అధికారులతో విచారణ జరిపించాలని, తక్షణం సంబంధిత రెవిన్యూ రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కోరారు. విచారణ ద్వారా వాస్తవాలు బహిర్గతం చేయడంతో పాటు అక్రమాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం వున్న రియల్టర్లు, ప్రభుత్వ అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేయించాలని విజ్ఞప్తి చేశారు. పీలేరు తహసిల్దారు కార్యాలయంలో రెవిన్యూ రికార్డులను ట్యాంపర్‌ చేసిన అధికారులపై కూడా క్రిమినల్‌ కేసులు పెట్టాలని కోరారు.

 

చింతల వ్యూహం వెనుక?

పీలేరు, పరిసరాల్లో ప్రభుత్వ భూములు భారీగా అన్యాక్రాంతం కావడం, ఆ భూముల్లో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరిగిపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారింది.. 2009 నుంచీ ఇప్పటి వరకూ ఈ దందా కొనసాగుతునే ఉంది. వాటిపై 2009-14 నడుమ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు ఆరోపణలు చేయగా, 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. తిరిగి ఇపుడు వైసీపీ అధికారంలో వుండగా టీడీపీ నాయకులు భూ కబ్జాల చిట్టా విప్పారు. ఆశ్చర్యకరంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా అవే ఆరోపణలు చేస్తూ సమగ్ర విచారణకు ఆదేశించాలని సీఎంకు లేఖ రాశారు. 2009 నుంచీ 2019 వరకూ జరిగిన భూ కబ్జాలపై విచారణ కోరడంలో వింతేమీ లేదు కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 2019 నుంచీ 2021 వరకూ జరిగిన దందాలపై ఆయన విచారణ కోరడమే ఇపుడు చర్చనీయాంశమైంది.


నిజానికి గత టీడీపీ ప్రభుత్వంలో కబ్జాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ నాయకులు పలువురు ఇపుడు వైసీపీలోనే వున్నారు. తమ దందా కొనసాగిస్తున్నారు. దీనిపై ముందునుంచీ వైసీపీలో కొనసాగుతున్న వారు గుర్రుగా వుంటున్నారు. సరిగ్గా దాన్నే చింతల తనకు అనుకూలంగా మలుచుకున్నట్టు కనిపిస్తోంది. స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యేనే విచారణకు కోరిన నేపధ్యంలో సీఎం కార్యాలయం ఎలా స్పందిస్తుందో, ఒకవేళ విచారణకు ఆదేశిస్తే తదుపరి పరిణామాలు ఎలా వుంటాయో వేచి చూడాల్సివుంది.

Updated Date - 2021-07-07T06:57:41+05:30 IST