పోలింగ్కు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2021-04-17T04:35:54+05:30 IST
నాయుడుపేట నుంచి బ్యాలెట్ బాక్సులతో బయలుదేరుతున్న ఎన్నికల అధికారులు
పర్యవేక్షించిన కలెక్టర్, డీఐజీ
సామగ్రితో తరలిన సిబ్బంది
సమస్యాత్మక.. అతి సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ఠ భద్రత
నాయుడుపేట, ఏప్రిల్ 16 : సూళ్లూరుపేట నియోజకవర్గంలో 343 పోలింగ్ కేంద్రాల్లో జరిగే పోలింగ్కు నాయుడుపేట ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్నికల సామగ్రిని అందజేశారు. కలెక్టర్ చక్రధర్బాబు, డీఐజీ త్రివిక్రమవర్మ, జేసీ ప్రభాకర్రెడ్డి, ఆర్డీవో సరోజినిలు శుక్రవారం ఆ కార్యక్రమాఇ్న పర్యవేక్షించారు. 343 కేంద్రాల్లో 126 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 46 మంది సెక్టార్ అధికారులు , 44 మంది రూట్ ఆఫీసర్లు నియమితులయ్యారు. 8 ఫ్లయింగ్ స్క్వాడ్, 8 మోడల్ కోడ్ ఆఫ్ కండక్టింగ్ , మూడు సర్వేటీములు , 3 వీడియో కాన్ఫరెన్స్ టీములను ఏర్పాటు చేశారు. 343 మంది చొప్పున పీవోలు, ఏపీవోలు 343, ఓపీవోలు 686, 90 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది , 98 మంది ఏపీఎస్పి 98, 494 పోలీస్ సిబ్బంది మంది ఎన్నికలను పర్యవేక్షించనున్నారు.
తడ : మండలంలో 18 పంచాయతీలకు గాను 50 బూత్లను ఏర్పాటు చేశారు. మొత్తం 250 మంది అధికారులను, సిబ్బందిని నియమించారు. వారు కాకుండా ఏడుగురు సెక్టార్ ఆఫీసర్లు, 7 రూట్లకు ఏడుగురు అధికారులను నియమించారు. పోలీసు పటిష్టబందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా ఒక సీఐని, ఒక ఎస్ఐని, 16 మంది స్పెషల్పార్టీ పోలీసులను, 30 మంది మహిళా పోలీసులతో కలిపి 110 మంది పోలీసులు పోలింగ్ విధులలో పాలుపంచుకోనునున్నారు. అతి సమస్యాత్మక పంచాయతీలైన వేనాడు, కారూరు, రామాపురం, వాటంబేడు గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఇక ఇరకందీవిలో ఉన్న సుమారు 1080 మంది ఓటర్లకు గాను రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ అధికారులు పోలింగ్ సామగ్రిని, ఈవీఎంలను తీసుకొని ప్రత్యేక పడవలో శుక్రవారం సాయంత్రం ఇరకందీవికి వెళ్లారు. ఇరకందీవి, వేనాడుల్లో మాత్రం ఒక గంట ముందుగా సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగించనున్నారు.
ఎన్నికల విధులకు 158 మంది పోలీసులు
సూళ్లూరుపేట : తడ, సూళ్లూరుపేట మండలాలల్లో తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ బందోబస్తు కోసం 158 మంది పోలీసులను నియమించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్ఐలు, 25 మంది చొప్పున ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, 25 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, 32 మంది సాయుధ పోలీసులు, 40 మంది స్పెషల్ పార్టీ పోలీసులు ఎన్నికల విధులకు నియమించినట్లు సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి తెలిపారు.
ఓజిలి : మండలంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మండల ఎన్నికల అధికారి, తహసీల్దారు అనూరాధ తెలిపారు. ఆమె శుక్రవారం మండలంలోని అన్ని పోలింగ్ స్టేషన్లను మరో పర్యాయం పరిశీలించి ఎన్నికల నియమావళిపై ఆరాతీశారు. మండలంలోని 42 పోలింగ్ కేంద్రాల ద్వారా 28,346 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు ఎదురుకాకుండా గట్టి పోలీసు నిఘా, బందోబస్తు ఏర్పాటుచేశారు.