రైతులతో చర్చలకు కేంద్రం రెడీ: అమిత్ షా

ABN , First Publish Date - 2020-11-29T02:45:55+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ స్పందించారు....

రైతులతో చర్చలకు కేంద్రం రెడీ: అమిత్ షా

 న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. రైతులతో చర్చలు జరిపేందుకు, వారి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 3లోగా వారితో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందనీ.. రైతులంతా వారి ఆందోళన కోసం ఢిల్లీ పోలీసులు సూచించిన నిరంకారీ సమాగం మైదానానికి వెళ్లాలని షా విజ్ఞప్తి చేశారు. ‘‘ఢిల్లీ-హర్యానా సరిహద్దు, పంజాబ్ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతులకు నేను చెప్పదల్చుకున్నదేమంటే.. వారితో చర్చించేందుకు, ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. డిసెంబర్ 3న కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్‌తో సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలను చర్చిస్తాం. వారి బాధను, ఆందోళనను వినేందుకు మేము సిద్ధంగా ఉన్నాం...’’ అని షా పేర్కొన్నారు.


రైతులంతా చాలా ప్రదేశాల్లో ట్రాక్టర్లు, ట్రాలీల్లో హైవేలపై చలిలో గడుపుతున్నారనీ.. వారి సౌకర్యార్థం దయచేసి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన మైదానానికి తరలించాలంటూ రైతు సంఘాలను హోంమంత్రి అభ్యర్థించారు. దీనివల్ల వాహనదారులకు కూడా ఇబ్బంది ఉండదనీ.. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు తమ ఆందోళన కొనసాగించవచ్చునని ఆయన అన్నారు. ‘‘ మీ అందర్నీ సౌకర్యవంతమైన పెద్ద మైదానంలోకి తరలించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అక్కడ మీకోసం అంబులెన్సులు, వైద్య, ఆహారం, టాయిలెట్లు, భద్రత వంటి ఏర్పాట్లు చేశాం...’’ అని షా వివరించారు. డిసెంబర్ 3 కంటే ముందే చర్చలు జరపాలని రైతులు కోరితే అందుకు కూడా తాము సిద్ధమేనని ఆయన అన్నారు. 

Updated Date - 2020-11-29T02:45:55+05:30 IST