Karnataka TDP: అన్న క్యాంటీన్ ధ్వంసం క్షమించరాని నేరం
ABN , First Publish Date - 2022-08-26T17:36:58+05:30 IST
చిత్తూరు జిల్లాలోని కుప్పంలో గురువారం అన్నక్యాంటీన్ను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని తెలుగుదేశం కర్ణాటక కోఆర్డినేటర్
- తెలుగుదేశం కర్ణాటక కో ఆర్డినేటర్ రావి మోహన్ చౌదరి
బెంగళూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలోని కుప్పంలో గురువారం అన్నక్యాంటీన్ను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని తెలుగుదేశం కర్ణాటక కోఆర్డినేటర్ రావి మోహన్ చౌదరి(Ravi Mohan Chaudhary) పేర్కొన్నారు. నగరంలో గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జడ్ ఫ్లస్ భద్రత ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Former Chief Minister Nara Chandrababu Naidu) పర్యటనను వైసీపీ అల్లరి మూకలు అడుగడుగునా అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేత హోదాలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కుప్పం విచ్చేసిన చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు వైసీపీ(YCP) గూండాలకు కొమ్ముకాస్తుండటం సిగ్గుచేటన్నారు. స్వచ్ఛందంగా పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ను ధ్వంసం చేయడం వైసీపీ అరాచకత్వానికి పరాకాష్టగా ఉందన్నారు. చంద్రబాబుకు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను సహించలేకే ఇలాంటి చిల్లర రాజకీయాలకు వైసీపీ పాల్పడుతోందని రావి ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయని పోరాటానికి యువత సన్నద్ధమవుతోందని ఆయన వెల్లడించారు.