కొవిడ్ నిబంధనలు కఠినతరం
ABN , First Publish Date - 2021-04-13T06:02:03+05:30 IST
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలను కఠినతరం చేయాలని ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశంలో అధికారులు నిర్ణయించారు.
రెవెన్యూ, పోలీస్, మునిసిపల్, వైద్యశాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలు
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలే
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలను కఠినతరం చేయాలని ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశంలో అధికారులు నిర్ణయించారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలపై ప్రజలకు కనీస అవగాహన క ల్పిస్తామన్నారు. మాస్క్ లేకుండా రోడ్లపై సంచరిస్తున్న వారికి జరిమానా విధించాలని నిర్ణయించామన్నారు. శానిటైజర్ల వినియోగం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని అన్నారు. కరోనా నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధిస్తారనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళతామన్నారు. పోలీస్, రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. వర్తక, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతోపాటు, క్యూలైన్లను పాటించాలన్నారు. కరోనా కట్టడి కోసం సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంల సహకారం తీసుకోవాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో పదవీ విరమణ చేసిన తహసీల్దార్ కృష్ణారావు-లలితాదేవి చారిటబుల్ ట్రస్ట్ తరపునకరోనా నియంత్రణపై అవగాహన కల్పిస్తూ ముద్రించిన కరపత్రాలను ఎస్పీ, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మల్లికాగర్గ్, ఆర్డీవో ఖాజావలి, తహసీల్దార్ సునీల్బాబు, ఎస్బీ డీఎస్పీ ధర్మేంద్ర పాల్గొన్నారు.