భారీగా చౌక బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-05-11T05:45:25+05:30 IST
లారీలోను, ఆటోలోను అక్రమంగా తరలిస్తున్న 707 చౌక బియ్యం బస్తాలను మేడికొండూరు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
మేడికొండూరు, మే 10: లారీలోను, ఆటోలోను అక్రమంగా తరలిస్తున్న 707 చౌక బియ్యం బస్తాలను మేడికొండూరు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులనుంచి అందిన సమాచారం మేరకు ఎస్ఐ నూతక్కి నరహరి పేరేచర్లలోని ఎల్ఎన్ఎస్ కాలనీ వద్ద లారీని ఆపి తనిఖీ చేయగా ఏడు వందల బస్తాలు బియ్యం ఉన్నాయి. దీనిపై డ్రైవర్ను ప్రశ్నించగా కొమెరపూడి నుంచి కాకినాడకు తరలిస్తున్నట్టు చెప్పాడు. లారీని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్కు తరలించారు. అదే విధంగా తాడికొండ మండలం రావెల గ్రామం నుంచి 7 క్వింటాళ్ల చౌక బియ్యం బస్తాలను ఫిరంగిపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆయా వాహనాల డ్రైవర్లు ఇచ్చిన సమాచారం ఆధారం పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.