ఆందోళన బాటలో రేషన్ డీలర్లు
ABN , First Publish Date - 2022-07-05T05:54:26+05:30 IST
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు ఆందోళన బాట పట్టారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు ఆందోళన బాట పట్టారు. రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని తహసీల్ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను తహసీల్ అధికారులకు సమర్పించారు.
మెదక్ అర్బన్/ రేగోడు/చిన్నశంకరంపేట/రామాయంపేట/అల్లాదుర్గం/పెద్దశంకరంపేట/ పాపన్నపేట/చిల్పచెడ్/తూప్రాన్/మాసాయిపేట/ జూలై 4: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాకు దిగారు. డీలర్ల సంఘం మెదక్ పట్టణ అధ్యక్షుడు విజయ్కుమార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వన్ నేషన్-వన్ కమీషన్ విధానంలో ప్రతీ క్వింటాల్కు కమీషన్ రూ.440కి పెంచాలంటూ పలు డిమాండ్లు చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా, జూలై 18న రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆందోళన కార్యక్రమం, ఆగస్టు 2న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించన్నుట్లు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్కుమార్ తెలిపారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రేగోడు మండలకేంద్రంలోని గాంధీచౌక్ వద్ద రేషన్ డీలర్లు నిరసన తెలిపి, డీలర్ల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ లక్ష్మణ్కు వినతిపత్రం ఇచ్చారు. చిన్నశంకరంపేట తహసీల్ కార్యాలయం వద్ద రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, తహసీల్దార్ మహేందర్గౌడ్ వినతి పత్రాన్ని అందజేశారు. రామాయంపేట మండలంలోని తహసీల్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లిన రేషన్ డీలర్లు, కార్యలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం తహసీల్దార్ మన్నన్కు వినతిపత్రాన్ని అందజేశారు. అల్లాదుర్గం మండల రేషన్ డీలర్లు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. పెద్దశంకరంపేట మండల రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. పాపన్నపేట మండలంలోని రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం రేషన్ డీలర్ల మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ హరిదీ్పసింగ్కు వినతి పత్రం అందజేశారు. నర్సాపూర్ రేషన్డీలర్ల అసోసియేషన్ఆధ్వర్యంలో సోమవారం తహసీల్ కార్యాలయంవద్ద నిరసన తెలిపి, డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ఆధ్వర్యంలో తహసీల్దార్ భాస్కర్కు వినతిపత్రం అందచేశారు. తూప్రాన్, మనోహరాబాద్ మండలాల రేషన్ డీలర్లు తహసీల్దారు కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తహసీల్దారు కార్యాలయం ముందు ఆందోళనలు చేసిన తూప్రాన్, మనోహరాబాద్ రేషన్ డీలర్లు తహసీల్దార్లు ఆనంద్బాబు, భిక్షపతిలకు వినతి చేశారు. చిల్పచెడ్ తహసీల్ కార్యాలయం ఎదుట మండల రేషన్ డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం అనంతరం తహసీల్దార్ కమలాద్రికి వినతి పత్రాన్ని అందజేసారు. మాసాయిపేట మండల కార్యాలయం ముందు మాసాయిపేట మండల డీలర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి, ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు.
సంగారెడ్డి జిల్లాలో..
పుల్కల్/హత్నూర/జిన్నారం/కల్హేర్/కంగ్టి/నారాయణఖేడ్/మనూరు/జహీరాబాద్/రాయికోడ్, జూలై 4: అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రేషన్ డీలర్లు సోమవారం నివధిక సమ్మె నిర్వహించారు. మండల కేంద్రాలైన పుల్కల్, చౌటకూర్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. సమ్మె అనంతరం తహసీల్దార్లకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. హత్నూరమండలంలోని రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. రేషన్ డీలర్ల సంఘం హక్కుల మండల శాఖ అధ్యక్షుడు బేగరి మల్లేశం ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. జిన్నారం మండల రేషన్ డీలర్లు తహసీల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ దశరథను కలిసి వినతి పత్రం అందజేశారు కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లోని రేషన్ డీలర్లు ఆయా తహసిల్దార్ కార్యాలయాల ముందు నిరసన, ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం తహసీల్దార్లు జయరాం, రత్నంకు వినతిపత్రాలను సమర్పించారు. కంగ్టి మండల డీలర్లు స్థానిక తహసీల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నారాయణఖేడ్లోని ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం రేషన్ డీలర్లు నిరసన దీక్ష నిర్వహించారు. అనంతరం వారు స్థానిక తహసీల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. మనూరు మండలకేంద్రంలో రేషన్ డీలర్లు నిరసన కార్యక్రమం నిర్వహించి, తహసీల్దార్ మురళికి వినతి పత్రం సమర్పించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం, మొగుడంపల్లి మండలాల రేషన్ డీలర్లు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ఆయా మండల తహసీల్దార్లకు అందజేశారు. రాయికోడ్ మండలంలో ఆయా గ్రామాల రేషన్ డీలర్లు తహసీల్దార్ రాజయ్యకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందజేశారు.