రాస్‌ మునిరత్నం సేవలు ప్రశంసనీయం

ABN , First Publish Date - 2022-08-20T06:13:21+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో రాస్‌ మునిరత్నం అందించిన సేవలు ప్రశంసనీయమని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.

రాస్‌ మునిరత్నం సేవలు ప్రశంసనీయం
మునిరత్నం విగ్రహావిష్కరణలో సీజేఐ ఎన్వీ రమణ,టీటీడీ ఈవో ధర్మారెడ్డి, పూర్వ జేఈవో శ్రీనివాస రాజు

తిరుపతి (ఆటోనగర్‌), ఆగస్టు 19: స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో రాస్‌ మునిరత్నం అందించిన సేవలు ప్రశంసనీయమని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. తిరుపతి అన్నమయ్య మార్గంలోని రాస్‌ సేవానిలయంలో శుక్రవారం రాష్ర్టీయ సేవాసమితి(రాస్‌) వ్యవస్థాపకుడు గుత్తా మునిరత్నం శిలావిగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ 40ఏళ్ల క్రితం రాయలసీమ సేవాసమితి పేరిట సేవాసంస్థను ఏర్పాటు చేసిన  మునిరత్నం పిల్లలకు, మహిళలకు, రైతులకు, వృద్ధులకు,దివ్యాంగులకు 21సేవలను తుదిశ్వాస విడిచే వరకు నిర్విరామంగా అందించారంటూ కొనియాడారు.మాజీ ఎంపీలు ఎన్జీ రంగా, రాజగోపాలనాయుడు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో అనితరమైన సేవలందించారని అభినందించారు. కార్యక్రమంలో రాస్‌ ఛైర్మన్‌ సుందర వడివేలు, ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటరత్నం, టీటీడీ ఈవో ధర్మారెడ్డి,పూర్వ జేఈవో శ్రీనివాస రాజు, రాస్‌ జాయింట్‌ సెక్రటరీ మమత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T06:13:21+05:30 IST