డీఎస్పీకి సీఐ సెల్యూట్.. ఇందులో విశేషమేంటో తెలిస్తే..
ABN , First Publish Date - 2021-01-04T06:06:23+05:30 IST
తండ్రి సీఐ అయితే.. కుమార్తె డీఎస్పీ
తిరుపతి: డీఎస్పీ ఎదురు పడగానే సీఐ వెంటనే సెల్యూట్ చేశారు. ఇందులో విశేషమేముంది అంటారా? తండ్రి సీఐ అయితే.. కుమార్తె డీఎస్పీ. ఈ అరుదైన ఘట్టం తిరుపతిలో పోలీస్ పరేడ్ మైదానంలో ఆవిష్కృతమైంది. తిరుపతికి చెందిన సీఐ శ్యాంసుందర్ కళ్యాణి డ్యామ్ పోలీసు ట్రైనింగ్ కళాశాలలో పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె జెస్సీ ప్రశాంతి 2018లో పోలీసు శాఖకు ఎంపికయ్యారు. ప్రస్తుతం గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి తిరుపతిలో జరగనున్న పోలీసు డ్యూటీమీట్కు ఆదివారం ఇద్దరూ హాజరయ్యారు. పరేడ్ మైదానంలో తన కుమార్తె తనకంటే పెద్ద ర్యాంకులో, ఉన్నతాధికారులతో కలిసి ఉండటం చూసి సంతోషపడ్డారు. ఎదురుపడగానే ఉప్పొంగిన గర్వంతో సెల్యూట్ చేశాడు. డీఎస్పీ జెస్సీ కూడా తిరిగి తన తండ్రికి సెల్యూట్ చేసి.. నవ్వేశారు. దీన్ని గమనించిన అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డి వారితో మాట్లాడి.. విషయం తెలుసుకుని ఇద్దరినీ అభినందించారు.