నయనానందంగా రామలింగేశ్వరుడి కల్యాణం
ABN , First Publish Date - 2022-06-27T05:30:00+05:30 IST
రామతీర్థంలో సోమవారం రాత్రి కామాక్షీదేవి సమేత రామలింగేశ్వరుడి కల్యాణం నయనా నందకరంగా సాగింది
రామతీర్థంకు పోటెత్తిన భక్తులు
ఒక్కటైన నూతన వధూవరులు
వైభవంగా గజవాహనసేవ
విడవలూరు, జూన్ 27: రామతీర్థంలో సోమవారం రాత్రి కామాక్షీదేవి సమేత రామలింగేశ్వరుడి కల్యాణం నయనా నందకరంగా సాగింది. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం ఆలయ ఆర్చకులు పేరేపి శ్రీకాంత్, శ్రీనివాసశర్మలు స్వామి,అమ్మవార్లకు గణపతిపూజ, పున్యావహచన, మహన్యాస రుద్రాభిషేకాలు, కుంకుమార్ఛనలు, నివేదన, బలిహరణ పూజలు నిర్వహిం చారు. మధ్యాహ్నం స్వామివారికి తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం నెల్లూరుకి చెందిన కాకాణి నరహరిరెడ్డి ఆధ్వర్యంలో పూలంగిసేవ నిర్వహించారు. తదుపరి శివపార్వతులను కల్యాణోత్సవానికి అలంకరిం చారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివాహ వేదికపై రామలింగేశ్వరుడు, కామక్షీదేవిలను కొలువు దీర్చారు. కల్యాణోత్సవానికి శాశ్వత ఉభయకర్తలైన పెన్నార్ ఆక్వా ఎక్స్పోర్టు ఆధినేత ఓజిలి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు స్వామి,అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. పండితులు వేదమత్రాలు పఠిస్తుండగా, మంగళవాయిద్యాల మధ్య స్వామి,అమ్మవార్ల కల్యాణం జరిగింది. ఆనంతరం స్వామివారికి భక్తులు చదివింపులు చేశారు.
వైభవంగా గజవాహన సేవ
కల్యాణం అనంతరం రామలింగేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై రామతీర్థం వీధుల్లో ఊరేగిం చారు. ఈ కార్యక్రమానికి వరిణి గ్రామానికి చెందిన రాఘవ రెడ్డి,సుధాకర్రెడ్డి,శ్రీధర్రెడ్డిలు ఉభయకర్తలుగా వ్యవహ రించారు. ఈ వేడుకల్లో ఆలయ చైర్మన్ నాటారు చంద్రయ్య, ఈవో వెంకటేశ్వర్లు, గుమస్తా వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.