ఇంటింటా మువ్వన్నెల జెండా
ABN , First Publish Date - 2022-08-15T05:26:46+05:30 IST
పట్టణాలు, గ్రామాల్లో జాతీయ జెండాతో ర్యాలీలు, ఇంటింటా మువ్వన్నెల జెండా రెపపెపలతో జాతీయ భావం వెల్లివిరుస్తోంది.
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్: పట్టణాలు, గ్రామాల్లో జాతీయ జెండాతో ర్యాలీలు, ఇంటింటా మువ్వన్నెల జెండా రెపపెపలతో జాతీయ భావం వెల్లివిరుస్తోంది. ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భీమవరం పట్టణంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆదివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎస్బీఐ రీజనల్ కార్యాలయ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. భీమవరం పట్టణం సమీపంలోని చినఅమిరంలో గొట్టుముక్కల బలరామరాజు, గొట్టుముక్కల రామచంద్రరాజు స్వాతంత్య్ర ఉద్యమంలో వీరోచిత పాత్ర పోషించారని వృద్ధాశ్రమం నిర్వాహక డైరెక్టర్ గొట్టుముక్కల రామరాజు అన్నారు. శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దంతులూరి నారాయణరాజుకూడా ఇక్కడి నుంచే ఉద్యమానికి నాంది పలికారన్నారు. కలవపూడి నరసింహ రాజు అలపించిన దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. పాలకొల్లు పట్టణంలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రెవేటు విద్యాసంస్థలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది జాతీయ జెండాలతో పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. గాంధీబొమ్మల సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర రామ మోహన్, జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. పలుచోట్ల కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్ కుమార్, తహసీల్దార్ జి.మమ్మి, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. నరసాపురంలో 125 అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రధా న వీధుల గుండా సాగిన ప్రదర్శనలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మున్సిపల్ చైర్పర్సన్ బర్రి వెంకట రమణ, ఎంఈవో పుష్పరాజ్యం పాల్గొన్నారు. ఆకివీడులో స్వాతంత్య్ర సమరయోధుడు మోర కుటుంబరెడ్డి భార్య చిట్టెమ్మను తహసీల్దార్ నీలాపు గురుమూర్తి రెడ్డి, ఎంపీడీవో శ్రీకర్ సన్మానించారు. పట్టణంలో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులను సత్కరించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామ యువత ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కాళ్ళ మండలంలో ఇళ్లపై జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. వీరవాసరం వీఈసీ జూనియర్ కళాశాల అధ్యా పకులు, విద్యార్థులు జాతీయ పతాకాన్ని చేపట్టి ర్యాలీ చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి జాతీయ గీతాలను ఆలపించారు. నవుడూరు జంక్షన్లో సీపీఎం ఆఽధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పా టు చేశారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం అంబేడ్కర్ సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వ ర్యంలో మానవహారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం లూథరన్ చర్చిలో ఆదివారం క్రైస్థవ ప్రార్థ నల అనంతరం చిన్నారులు ప్రత్యేక వేషధారణలతో వందేమాతరానికి నృత్యం చేశారు. తణుకు పట్టణంలోని కోగంటి హోమ్స్లో నివాసాలకు జిల్లా స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎం.శ్యామ్ కుమార్ జాతీయ జెండాలు పంపిణీ చేశారు.