రాజ్యసభ ఉద్యోగుల నివాస సముదాయానికి ఉపరాష్ట్రపతి శంకుస్థాపన
ABN , First Publish Date - 2020-08-11T08:12:13+05:30 IST
రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల కోసం 40 నివాస గృహాలతో కూడిన సముదాయం నిర్మాణానికి సోమవారం ఆన్లైన్ ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు...
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల కోసం 40 నివాస గృహాలతో కూడిన సముదాయం నిర్మాణానికి సోమవారం ఆన్లైన్ ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని ఆర్కే పురం సెక్టార్ 12లో రూ.46 కోట్ల వ్యయంతో ఈ సముదాయాన్ని నిర్మించనున్నారు. ఈ భూమిని 2003లోనే కేటాయించినా కొన్ని అడ్డంకుల వల్ల ఆలస్యమైనట్లు వెంకయ్య నాయుడు తెలిపారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత సమస్య కొలిక్కి వచ్చినట్లు వివరించారు. ఉద్యోగులకు క్వార్టర్ల కొరత ఉందని, ఈ సముదాయం నిర్మాణంతో సమస్య కొంత వరకు పరిష్కారమవుతుందన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.