బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా పరార్! : బీజేపీ ఎంపీ

ABN , First Publish Date - 2020-08-14T17:34:43+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ఓవైపు వైరస్‌ను..

బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా పరార్! : బీజేపీ ఎంపీ

జైపూర్: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఓవైపు ఈ వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్ కోసం పరిశోధకులు, శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తుంటే.. మరోవైపు దీనికి ఇదిగో పరిష్కారం అంటూ సొంత వైద్యాలు, వింత విధానాలు హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి రాజకీయ నాయకులు కూడా అతీతం కాదు. తాజాగా రాజస్థాన్‌కి చెందిన బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనపూరియా ఇలాంటి వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలిచారు. ఒంటికి బురద రాసుకుని, శంఖం ఊదితే నోవెల్ కరోనా వైరస్ పరారైపోతుందంటూ ఆయన పేర్కొన్నారు. ‘‘శంఖం ఊదుతూ బురదలో కూర్చుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మన శరీరం కొవిడ్-19పై సమర్థంగా పోరాడగలదు...’’ అని ఎంపీ సుఖ్‌బీర్ చెప్పుకొచ్చారు.


కాగా ఈ ఏడాది మొదట్లో కూడా సదరు ఎంపీ గారు ఇదే తరహాలో మరికొన్ని సూచనలు చేశారు. ‘‘ఒంటికి బురద రాసుకుని యోగా చేస్తే ఎలాంటి జబ్బులైనా మటుమాయం అయిపోతాయి...’’ అంటూ యోగా డే సందర్భంగా సుఖ్‌బీర్ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి అర్జున్ ముండా సైతం ఇలాంటి వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ‘‘భాభీజీ అప్పడాల్లో’’ రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలు ఉన్నాయనీ.. కరోనా వైరస్‌ను జయించేందుకు వీటిని తినాలంటూ ఆయన పేర్కొనడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. తీరా ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. 

Updated Date - 2020-08-14T17:34:43+05:30 IST