ఇదేనా స్మార్ట్ సిటీ
ABN , First Publish Date - 2022-09-21T05:37:32+05:30 IST
వర్షం కురిస్తే ఏలూరులో మోకాళ్ల లోతున నీరు నిలిచిపో తోంది. ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి నీరు చేరుతోంది.
వర్షం వస్తే ఏలూరు చెరువే
నగరం జలమయం
ఏ రోడ్డు చూసినా మడుగే..
డ్రెయిన్లు, రోడ్లూ ఏకం
మోకాళ్లలోతున ప్రవాహం
నగరవాసులకు నరకం
ప్రభుత్వ ఆసుపత్రిలోకి వర్షం నీరు
రోగులు, వైద్యులు, సిబ్బంది అవస్థలు
కొద్దిపాటి వర్షానికే ఏలూరు నగరం జలమయం అవుతోంది. భారీ వర్షం కురిస్తే నగరంలోని అన్ని రోడ్లూ మడుగుల్లా తయారవుతున్నాయి. డ్రెయిన్లు, రోడ్లూ ఏకమైపోతాయి.. వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఇంకా ఎంత కాలం ఈ పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
ఏలూరు టూటౌన్ /రూరల్ సెప్టెంబరు 20: వర్షం కురిస్తే ఏలూరులో మోకాళ్ల లోతున నీరు నిలిచిపో తోంది. ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి నీరు చేరుతోంది. డ్రెయినేజీలు పొంగి రహదారులపైకి నీరు వరదలా చేరు తోంది. దీంతో దోమలు ప్రభలి అనారోగ్యాల పాలవుతామని బెంబెలెత్తుతున్నారు. ప్రతీ ఏడాది పూడిక తీయడం, మళ్లీ అవి పూడుకుపోవడం అనవాయితీగా మారింది. డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్లు, రోడ్లు వేస్తేనే ఈ సమస్యకు పరిష్కా రం దొరుకుతుందని భావిస్తున్నారు. 2016లో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు స్మార్ట్ సిటీగా ప్రకటించి రూ.1,243 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. 2019లో రూ.6 కోట్లు విడుదల చేసి పనులు ప్రారంభించారు. వైసీపీ ప్రభు త్వం వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ పనులను మూలన పడేసింది. టీడీపీ హయాంలో రూ.37.48 కోట్లతో అండర్గ్రౌం డ్ డ్రెయినేజీ పనులు ప్రారంభించింది. 50 లక్షల లీటర్ల కెపాసిటీతో మురుగునీరు శుద్ధి కేంద్రం ప్రారంభించింది. ఆ పనులు కూడా నత్తనడకన నడుస్తున్నాయి. పవర్పేట, ఆర్ఆర్పేట, అశోక్నగర్, విలీన గ్రామాలు వన్టౌన్ ప్రాంతాలు వర్షం వస్తే జలమయం అవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే సమస్య తీరుతుంది. నూతనంగా డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
ప్రభుత్వాసుపత్రిలో అవస్థలు
వర్షం వస్తే ఏలూరు ఆసుపత్రి పరిస్థితి దయనీయం. వార్డుల్లోకి వర్షం నీరు చేరుతోంది. వర్షాల ప్రభావంతో రోగాల బారినపడి ఆసుపత్రులకు వెళ్తుంటారు. ఆసుపత్రిలోకే మురుగు నీరు చేరుతుంటే రోగుల పరిస్థితి ఏమిటి..? సోమవారం కురిసిన వర్షానికి ఆసుపత్రిలోకి వర్షం నీరు చేరింది. ఆసుపత్రి పాత భవనంలో ఓపీ వార్డుల్లోనూ, ఎక్స్రే, కంప్యూటర్ రూముల్లోకి నీరు చేరింది. డ్రెయినేజీ నీటితో కలిసి మోకాలు లోతు వరకూ నీరు చేరడంతో రోగులు వారి సహాయకులతోపాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుర్గంధంతో సతమతమయ్యారు. తమకు వచ్చిన రోగాలు నయం చేసుకునేందుకు ఆసుపత్రికి వస్తే తమకు కొత్త రోగాలు వచ్చే దుస్థితి నెలకొందని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం వర్షపు నీటిని, బురదను సిబ్బంది ఎత్తిపోశారు. ఆవరణలో పారిశుధ్య కార్మికులు శుభ్రం చేశారు. కొన్ని కంప్యూటర్లలోకి నీరు చేరడంతో వాటిని ఎండలో ఆరబెట్టారు. ఆసు పత్రి ఆధునికీకరణ కోసం తెచ్చిన సామగ్రి వర్షం నీటిలో నానుతోంది. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారుల ముందు చూపులేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. వర్షం నీరు బయటకుపోయే మార్గం లేక వైద్యులు, రోగులు తీవ్ర ఇబ్బం దులు పడాల్సి వస్తోంది. వర్షం నీరు ఆసుప త్రిలోకి రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవా లని రోగులు కోరుతున్నారు.