అన్ని రంగాల్లో వాల్తేరు డివిజన్‌ ముందంజ

ABN , First Publish Date - 2021-01-27T06:14:24+05:30 IST

వాల్తేరు రైల్వే డివిజన్‌ అన్ని విభాగాల్లో ముందంజలో ఉందని డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

అన్ని రంగాల్లో వాల్తేరు డివిజన్‌ ముందంజ
గౌరవవందనం స్వీకరిస్తున్న డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ

డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ

విశాఖపట్నం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : వాల్తేరు రైల్వే డివిజన్‌ అన్ని విభాగాల్లో  ముందంజలో ఉందని డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగిస్తూ డివిజన్‌కు 11 విభాగాల్లో అవార్డులు వచ్చాయన్నారు. గత డిసెంబరు నాటికి 4,194 మిలియన్‌ టన్నుల సరకును రవాణా చేసి, రూ.5,035.75 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించిందన్నారు. ఏడీఆర్‌ఎంలు అక్షయ్‌ సక్సేనా, డాక్టర్‌ సి.సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన వారికి అవార్డులు అందజేశారు.

తూర్పు నౌకాదళంలో..

తూర్పు నౌకాదళంలో చీఫ్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్‌  జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. 50 మంది సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కొవిడ్‌ సమయంలో మెరుగైన సేవలు అందించిన వారందరినీ అభినందించారు. 

వీఎంఆర్‌డీఏలో..

గణతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు సూచించారు. సిరిపురం కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మనజీర్‌ జిలానీ సామూన్‌, సెక్రటరీ గణేశ్‌కుమార్‌, ఈఓ లక్ష్మణమూర్తి, చీఫ్‌ ఇంజనీర్‌ కె.రామమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఈపీడీసీఎల్‌లో..

ఈపీడీసీఎల్‌ పరిధిలో 46 వేల మంది రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని సీఎండీ నాగలక్ష్మి వెల్లడించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.  డైరక్టర్లు రాజబాపయ్య, రమేశ్‌ప్రసాద్‌, డి.చంద్రం, సీజీఎంలు సింహాద్రి, జయలలిత, శరత్‌కుమార్‌  పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-27T06:14:24+05:30 IST