రైల్వే లైన్ కోసం భూ సేకరణ
ABN , First Publish Date - 2022-08-12T04:56:21+05:30 IST
మూడో రైల్వే లైన్ ఏర్పాటుకు కావాల్సిన భూ సేకరణ కోసం ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్ గురువారం మధిర మండలంలో పలు గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు.
రైతులతో ఆర్డీవో సమావేశం
ఎకరాకి రూ. 50 లక్షలు ఇవ్వాలని రైతుల డిమాండ్
మధిర రూరల్ ఆగస్టు 11: మూడో రైల్వే లైన్ ఏర్పాటుకు కావాల్సిన భూ సేకరణ కోసం ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్ గురువారం మధిర మండలంలో పలు గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభు త్వం కాజీపేట కొండపల్లి మధ్య నూతనంగా మూడో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ రైల్వే లైన్ కు కావాల్సిన భూసేకరణ కోసం ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్ మధిర ఎంపీడీవో కార్యాలయంలో బాధిత గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ రైల్వే లైన్ కింద భూమి కోల్పోయే రైతులకు ఎకరానికి 13.50 లక్షలు ధర చెల్లిస్తామని తెలిపారు. దీంతో రైతులు అభ్యంతరం తెలిపారు. ఇంత తక్కువ రేటుకు తమ భూములు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పారు. అంత తక్కువ పరిహారానికి రెండు పంటల పండే తమ భూములను ఎలా ఇస్తామని ఆర్డీవో ఎదుట మొరపెట్టుకున్నారు. రైల్వే లైన్లో భూమి పోయే రైతులందరికి ఎకరాకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు వోట్ల రఘు, వెంకటేశ్వరరావు, చల్లా వెంకటేశ్వరరావు, చల్లా భద్రం, ఆయతం రామారావు పాల్గొన్నారు.