పట్టుబడిన బియ్యం బస్తాలపై లేబుళ్లు మాయం!
ABN , First Publish Date - 2022-04-13T04:19:50+05:30 IST
జిల్లా ఉన్నతాధికారులు తనిఖీకి వస్తే ఆధారాలు దొరకకుండా ఉండేందుకు గోదాముల్లో పనిచేసే కొందరు సిబ్బంది, అక్రమార్కులు పట్టుబడిన రేషన్ బియ్యం బస్తాలపై ఉన్న లేబుళ్లను మాయం చేశారు.
కేసుకు ఆధారాల్లేకుండా తొలగింపు
సిబ్బంది చేతివాటం
అక్రమార్కులపై చర్యలు శూన్యం
ఉదయగిరి, ఏప్రిల్ 12: జిల్లా ఉన్నతాధికారులు తనిఖీకి వస్తే ఆధారాలు దొరకకుండా ఉండేందుకు గోదాముల్లో పనిచేసే కొందరు సిబ్బంది, అక్రమార్కులు పట్టుబడిన రేషన్ బియ్యం బస్తాలపై ఉన్న లేబుళ్లను మాయం చేశారు. భారీగా బియ్యం పట్టుబడి 20 రోజులు కావస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు తనిఖీలు చేసి అందుకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ సంఘటనలో సూత్రధారులు, పాత్రఽధారులు నేటికీ తేలకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బియ్యం పట్టుబడిందిలా..
గతనెల 26న ఉదయగిరి పౌరసరఫరాల గోదాము నుంచి ఓ మినీ లారీలో 200 బస్తాల రేషన్బియ్యం అక్రమంగా తరలించడాన్ని స్థానికులు గుర్తించి వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పరిశీలించగా ఎలాంటి పత్రాలు లేకుండా బియ్యం స్థానిక గోదాము నుంచి తీసుకెళుతున్నట్లు మినీ వాహన డ్రైవర్ రాతపూర్వకంగా పోలీసులకు రాసిచ్చాడు. అప్పట్లో రెవెన్యూ అధికారులు పరిశీలించి వాహనంతోపాటు బియ్యం బస్తాలను పోలీసులకు స్వాధీనపర్చారు. పోలీసులు డ్రైవర్, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం బియ్యం బస్తాలను ఉదయగిరి పౌరసరఫరాల అధికారులకు అప్పగించారు.
లేబుళ్లు మాయం
ఉదయగిరి పౌరసరఫరాల గోదాముకు బాపట్ల, నెల్లూరు, కావలి తదితర ఆహార సంస్థల గిడ్డంగుల ద్వారా ప్రభుత్వం బియ్యాన్ని సరఫరా చేస్తుంది. అయితే గతనెల్లో బాపట్ల నుంచి ఈ గోదాముకు బియ్యం తరలించారు. బియ్యం బస్తాలపై ఉన్న లేబుళ్ల ప్రకారం బాపట్ల అని ఉంది. లేబుళ్లపై లాట్ నెంబర్, మిల్లు, ఊరి పేరు తదితర వివరాలన్నీ ఉండడంతో వాటి ఆధారంగా దొంగలు బయటపడతారన్న ఉద్దేశంతో ఆధారాలు దొరకకుండా లేబుళ్లను చించిపారేశారు.
మాకు తెలియదు
బియ్యం బస్తాలపై లేబుళ్లు మాయం విషయమై మాకు తెలియదు. బియ్యం స్వాధీనం చేసే సమయంలోనే బస్తాలపై లేబుళ్లు లేవని, మాకు స్వాధీనపర్చే అధికారులు తొలగించి ఉంటారేమో.
- మల్లికార్జున, గోదాము ఇన్చార్జి