లతా మంగేష్కర్ గళం నిరంతరం మారుమోగుతుంది : రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2022-02-06T17:37:57+05:30 IST
లతా మంగేష్కర్ మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం
న్యూఢిల్లీ : ‘భారత రత్న’ లతా మంగేష్కర్ మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. ఆదివారం ఆయన ఇచ్చిన ట్వీట్లో, లతా మంగేష్కర్ మరణించినట్లు విచారకరమైన వార్త తెలిసిందని తెలిపారు. అనేక దశాబ్దాలపాటు ఆమె అత్యంత ప్రియమైన భారతీయ గళంగా కొనసాగారన్నారు. ఆమె బంగారు గళం శాశ్వతమైనదని, ఆ గళం ఆమె అభిమానుల హృదయాల్లో నిరంతరం మారుమోగుతుందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇచ్చిన ట్వీట్లో, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ లతా మంగేష్కర్ కలిసి ఉన్న ఫొటోను పెట్టారు. లతా మంగేష్కర్ మరణం భారతీయ కళా ప్రపంచానికి తీరని నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుఃఖ సమయంలో బాధను తట్టుకోవడానికి తగిన ఆత్మస్థయిర్యాన్ని భగవంతుడు ఆమె కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.