Rahul Gandhi: ఈడీ విచారణకు హాజరు కాని రాహుల్ గాంధీ.. కారణం ఏం చెప్పారంటే..

ABN , First Publish Date - 2022-06-02T20:59:39+05:30 IST

ఈడీ విచారణకు హాజరుకావడంలేదని రాహుల్గాంధీ సమాచారం పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు ఉన్నందున..

Rahul Gandhi: ఈడీ విచారణకు హాజరు కాని రాహుల్ గాంధీ.. కారణం ఏం చెప్పారంటే..

న్యూఢిల్లీ: ఈడీ విచారణకు హాజరుకావడంలేదని రాహుల్గాంధీ సమాచారం పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు ఉన్నందున హాజరుకావడం లేదని రాహుల్ పేర్కొన్నట్లు వెల్లడించింది. నిన్న సాయంత్రం ఈడీకి ఈ విషయాన్ని వివరిస్తూ రాహుల్ గాంధీ మెయిల్ పంపారు. నేషనల్ హెరాల్డ్ కుంభకోణం కేసులో హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని మెయిల్ పంపినట్లు ఈడీ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఇదే కేసులో జూన్ 8న విచారణకు హాజరుకావాల్సిన సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. సోనియాగాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్లో ఉన్నారు. సోనియాతో సమావేశమైన కాంగ్రెస్ నేతలకు కూడా కరోనా సోకినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 8న ఈడీ విచారణకు సోనియా హాజరవుతారతారని సూర్జేవాలా చెప్పడం గమనార్హం.



కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీలకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో వారిద్దరినీ ప్రశ్నించనున్నట్టు బుధవారం జారీ చేసిన ఆ సమన్లలో ఈడీ పేర్కొంది. రాహుల్‌ గురువారం, సోనియా ఈనెల 8వ తేదీన ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి రావాలని అందులో స్పష్టం చేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద వారిద్దరి వాంగ్మూలాలూ నమోదు చేయనున్నట్టు తెలిపింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికలో సోనియా, రాహుల్‌ల షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించి ప్రశ్నించనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. కాగా, ఈ చర్యను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి సమన్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

Updated Date - 2022-06-02T20:59:39+05:30 IST