తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటిషన్

ABN , First Publish Date - 2022-03-08T18:34:07+05:30 IST

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటిషన్ వేసింది.

తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటిషన్

హైదరాబాద్: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటిషన్ వేసింది. అలాగే దీనిపై బండి సంజయ్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘనందనరావు మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. శాసనసభలో స్పీకర్ తీరు కీలుబొమ్మ మాదిరి ఉందని విమర్శించారు.

 

ఏ సెక్షన్ కింద బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారో ప్రజలకు స్పీకర్ చెప్పాలని రఘనందనరావు డిమాండ్‌ చేశారు. గతంలో సభలో గవర్నర్‌ను అవమానించి.. బల్లలు ఎక్కిన హరీష్‌రావుతో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదన్నారు. బడ్జెట్ స్పీచ్‌లో రాజకీయ విమర్శలు చేసిన మంత్రిగా హరీష్ రావు చరిత్రలో నిలిచిపోతారన్నారు. కేంద్రాన్ని తిట్టడానికి మాత్రమే బడ్జెట్ ప్రసంగాన్ని ఉపయోగించుకోవటం దుర్మార్గమన్నారు. తమ స్థానంలో నిలబడి నిరసన చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్వయంగా రాసి ఇచ్చిన పేపర్‌ను మంత్రి తలసాని సభలో చదివారని ఆరోపించారు. పాలకపక్షంతో పాటు.‌‌. ప్రతిపక్షం కూడా బాగుంటేనే స్పీకర్ గౌరవం పెరుగుతుందన్నారు. ఏ సెక్షన్ కింద బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెషన్ చేశారో రాతపూర్వకంగా చెప్పాలని అసెంబ్లీ సెక్రటరీని అడిగితే నాలుగు రోజుల సమయం అడిగారని రఘనందనరావు విమర్శించారు.

Updated Date - 2022-03-08T18:34:07+05:30 IST