నేషనల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటిన రాజాం పీటీ క్రీడాకారులు
ABN , First Publish Date - 2021-10-20T06:29:33+05:30 IST
గోవాలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్-2021 పోటీల్లో మండలంలోని రాజాం మహా సంఘర్షణ ఫిజికల్ ట్రైనింగ్ సంస్థలో శిక్షణ పొందిన క్రీడాకారులు సత్తా చాటారు.
4 పసిడి, 4 రజత, 2 కాంస్య పతకాల సాధన
బుచ్చెయ్యపేట, అక్టోబరు 19: గోవాలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్-2021 పోటీల్లో మండలంలోని రాజాం మహా సంఘర్షణ ఫిజికల్ ట్రైనింగ్ సంస్థలో శిక్షణ పొందిన క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-17, అండర్-19, అండర్-21 విభాగాల్లో పరుగు పందెం, త్రోబాల్, బాస్కెట్బాల్ పోటీల్లో నాలుగు పసిడి, నాలుగు రజత, రెండు కాంస్య పతకాలను సాధించారని సంస్థ కోచ్ వేపాడ నాయుడు తెలిపారు. అండర్-17 విభాగంలో 1,500, 3,000 మీటర్ల పరుగు పందెంలో వొల్లే శంకరనాయుడు రజత, కాంస్య పతకాలను పొందాడు. అండర్-19 విభాగం 5,000 మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పందెంలో బుచ్చెయ్యపేట మండలం చిట్టియ్యపాలేనికి చెందిన వడ్డాది అప్పలనాయుడు వరుసగా బంగారు, రజత పతకాలను సాధించాడు. దేవరాపల్లి మండలం సీతమ్మపేటకి చెందిన నొడగల సతీశ్ 5,000 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందేల్లో రజత, కాంస్య పతకాలను సాధించాడు. అండర్-21 విభాగంలో పప్పల దుర్గా ప్రసాద్ 10 వేల పరుగు పందెంలో బంగారం, 800 మీటర్ల పందెంలో రజత పతకాలను కైవసం చేసుకున్నాడు. అండర్-19 విభాగం త్రోబాల్, బాస్కెట్బాల్ పోటీల్లో రాంబిల్లి మండలం హరిపురానికి చెందిన ప్రసాదుల కార్తీక్ బంగారు పతకాన్ని సాధించాడు.