కోట్లు వెచ్చించి.. వదిలేశారు!
ABN , First Publish Date - 2022-05-16T04:37:30+05:30 IST
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభాలు
- అలంకారప్రాయంగా విద్యుత్ స్తంభాలు
- హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై వెలగని ఎల్ఈడీ లైట్లు
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
- రాత్రిళ్లు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మొయినాబాద్ రూరల్, మే 15 : హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ స్తంభాలకు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు వెలగడం లేదు. దీంతో ఈ రోడ్డుపై రాత్రి వేళల్లో ప్రయాణం చేయాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని జంకుతున్నారు. గతేడాది రూ.3కోట్ల హెచ్ఎండీఏ నిధులతో నగరంలోని లంగర్హౌస్ టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి చేవెళ్ల మండల కేంద్రం వరకు హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి డివైడర్ మధ్యలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. కానీ వీటి నిర్వహణకు ఆయా పరిధిలో వచ్చే గ్రామపంచాయతీలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఎన్ఓసీ పత్రాలను సైతం ఆయా గ్రామపంచాయతీలు అధికారులకు అందజేశారు. ఇప్పటివరకు అన్నీ సక్రమంగానే జరిగినా నేటికీ స్తంభాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో లైట్లు వెలగడం లేదు. జాతీయరహదారి కావడంతో వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. రహదారివెంట వెలుగులు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిరుపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాలను వాహనాలు ఢీకొని పలువురు ప్రమాదాల బారినపడుతున్నారు. పనులు పూర్తయినా విద్యుత్ దీపాలను ఎందుకు ఉపయోగంలోకి తేవడం లేదో అర్ధం కావడం లేదు. ఇదే విషయంపై మండల ఎంపీడీవో సంధ్యతోపాటు ఆయా గ్రామపంచాయతీల కార్యదర్శులను వివరణ కోరగా.. విద్యుత్ స్తంభాలను హెచ్ఎండీఏ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని, వాటి నిర్వహణ బాధ్యతలను గ్రామపంచాయతీలకు అప్పజెప్పడంలో కొంత ఆలస్యమవుతుందని చెబుతు న్నారు. ఏదిఏమైనా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజాప్రతినిధులు స్పందించాలి
గతేడాది హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై విద్యుత్ దీపాల కోసం స్తంభాలను ఏర్పాటు చేశారు. కానీ నేటికీ లైట్లు వెలగడం లేదు. అధికార పార్టీ నాయకులు స్పందించి విద్యుత్ దీపాలు వెలిగేలా హెచ్ఎండీఏ అధికారులపై ఒత్తిడి తీసుకురావాలి. వెలుగు లేక రాత్రి వేళ ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే భయమేస్తుంది. చీకటిలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవచూపి రోడ్డు మఽఽధ్యలో లైట్లు వెలిగే విధంగా కృషి చేయాలి.
- షాపురం మానిక్యం, రెడ్డిపల్లి గ్రామం, మొయినాబాద్ మండలం